మల్లికార్జున ఖర్గేని అవమానించారా? బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్
వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేసే సమయంలో మల్లికార్జున్ ఖర్గే తలుపు దగ్గర నిలబడి చూస్తున్నట్లు బీజేపీ విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. ఖర్గేని అవమానించారని బీజేపీ ఆరోపించింది.
వయనాడ్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తలుపు దగ్గర నిలబడి చూస్తున్నట్లు బీజేపీ బుధవారం వీడియో విడుదల చేసింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్.. కాంగ్రెస్ పార్టీ ఖర్గేని అవమానించిందని ఆరోపించారు. ఎక్స్ పోస్టులో రాజీవ్ స్పందిస్తూ.. "కాంగ్రెస్ నాయకులు ప్రియాంక వాద్రా వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గేను బయట ఉంచారు. ఎందుకంటే ఆయన వారి కుఉంబం కాదు. సోనియా కుటుంబం అహంకార బలిపీఠం వద్ద ఆత్మగౌరవం & గౌరవం బలి అయ్యాయి. వారు సీనియర్ దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడితో ఇలా ప్రవర్తిస్తే, వాయనాడ్ ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో ఊహించండి" అంటూ కామెంట్ చేశారు.
"సీనియర్ దళిత నేతను, పార్టీ అధ్యక్షుడినే ఇలా చేస్తే, వయనాడ్ ప్రజలను ఎలా చూస్తారో ఊహించుకోండి" అని రాజీవ్ చంద్రశేఖర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నామినేషన్ సమయంలో మల్లికార్జున్ ఖర్గే సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ప్రియాంక్ ఖర్గే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. "బీజేపీ ట్రోలింగ్కి రూ.2 ఇస్తున్నారా? మీలాంటి వాళ్లకి ఎక్కువా? మీకున్న సమయాన్ని బట్టి చూస్తే, కనీస వేతనానికే బేరమాడతారని అనుకుంటున్నా" అని ప్రశ్నించారు.
"మీ వాదన ప్రకారం, కూర్చున్న ప్రభుత్వ అధికారి నామినేషన్ తీసుకుంటే ప్రధానిని అవమానించినట్లా? చట్టం, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. సిద్ధిపూర్ ప్రజలు దయతలచి మిమ్మల్ని గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నుకునేలా చూసుకోండి" అని పేర్కొన్నారు.