ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. 105 పురాతన వస్తువులను భారత్ కు అప్పగించిన యూఎస్
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసిన తరువాత భారత్ కుచెందిన పురాతన కళాఖండాలని యూఎస్ తిరిగి మన దేశానికి ఇచ్చేసింది. వీటిని మన దేశ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే అవి ఇండియాకు చేరుకోనున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అనంతరం క్రీస్తుశకం 2 నుంచి 3వ శతాబ్దం నుంచి 18-19వ శతాబ్దం వరకు ఉన్న మొత్తం 105 పురాతన వస్తువులను అమెరికా భారత్ కు తిరిగి ఇచ్చింది. వీటిని మన దేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు, కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, మాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయ అధికారుల సమక్షంలో న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ లో జరిగిన ప్రత్యేక పునరావాస కార్యక్రమంలో కొన్ని విలువైన భారతీయ పురాతన వస్తువులను అమెరికా అందజేసింది.
‘యోగి, మోడీ ప్రభుత్వాలే టార్గెట్.. ముంబైలో 26/11 తరహా మరో దాడి’- పోలీసులకు అగంతకుడి బెదిరింపు కాల్
ఈ సందర్భంగా సంధు.. మాట్లాడుతూ భారత్ కు తరలిస్తున్న 100 పురాతన వస్తువులు కేవలం కళ మాత్రమే కావని, మన వారసత్వం, సంస్కృతి, మతంలో భాగమని అన్నారు. కోల్పోయిన ఈ వారసత్వం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇది చాలా భావోద్వేగంతో స్వీకరిస్తున్నామని అన్నారు. త్వరలోనే పురాతత్వ వస్తువులను భారత్ కు వస్తాయని తెలిపారు. ‘‘మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు, ఇతర ఏజెన్సీలు అనేక కళాఖండాలను భారతదేశానికి తిరిగి పంపించడానికి సహాయపడ్డాయి. వారందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
‘‘సాంస్కృతిక ఆస్తుల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించడానికి, సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పనిచేయడానికి భారత్, అమెరికా అంగీకరించాయి. ఇది మా ఏజెన్సీల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్మగ్లర్లు చట్టాలను తప్పించుకోవడం కష్టతరం చేస్తుంది.’’ అని సంధు అన్నారు.
మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జోర్డాన్ స్టాక్డేల్ మాట్లాడుతూ.. గత ఏడాది అమెరికా 300కు పైగా పురాతన వస్తువులను భారత్ కు తిరిగి పంపిందని తెలిపారు. ఇంకా 1400కు పైగా వస్తువులను స్మగ్లర్ ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, వాటిని ఇంకా అధికారికంగా స్వదేశానికి పంపించాల్సి ఉందన్నారు. ఇటీవల వైట్ హౌస్ లో ప్రధాని మోడీ మాట్లాడిన మంచి మాటలను తాము అభినందిస్తున్నామని అన్నారు.
కాగా.. గత నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ కోల్పోయిన ఈ సాంస్కృతిక ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. దీంతో ఆయనకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 2016లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా 16 పురాతన వస్తువులను మొదటి సారిగా అమెరికా అందజేసింది. 2021 సెప్టెంబర్ లో ప్రధాని అమెరికా పర్యటన తర్వాత భారత్ కు కూడా 157 కళాఖండాలను అప్పగించింది.