భారత శాస్త్రజ్ఞుల కృషికి తార్కాణం.. జైకోవ్ డీ టీకా : ప్రధాని నరేంద్ర మోడీ
గుజరాత్కు చెందిన జైడస్ కాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్ డీ టీకాకు డ్రగ్ రెగ్యులేటరీ నుంచి అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. ఈ సందర్భంగా భారత శాస్త్రజ్ఞులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి భారత శాస్త్రజ్ఞులపై ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిపై భారత్ పరిపూర్ణ సత్తువతో పోరాడుతున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలో తొలి డీఎన్ఏ ఆధారిత టీకా జైకోవ్ డీ అని, దీనికి ఆమోద లభించడమే భారత శాస్త్రజ్ఞుల కృషిని వెల్లడిస్తున్నదని వివరించారు. ఇదొక విశిష్ట విజయము అని ట్వీట్ చేశారు.
గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డీ టీకాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవరసర వినియోగ అనుమతులనిచ్చింది. ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత టీకాగా జైకోవ్ డీ చరిత్ర సృష్టించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన జైకోవ్ డీ టీకా 12ఏళ్లు పైబడినవారందరికీ వేయవచ్చు. ఇది మూడు డోసుల టీకా. తొలి డోసు తర్వాత 28 రోజులకు సెకండ్ డోసు, 56 రోజులకు చివరి డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది నీడిల్లెస్ ఇంజక్షన్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్లో ఐదు టీకాలకు అనుమతి ఉన్నది. మనదేశంలో వినియోగానికి డ్రగ్ రెగ్యులేటరీ అనుమతి పొందిన ఆరో టీకాగా జైకోవ్ డీ నిలిచింది.