పాకిస్తాన్‌కు ఉగ్రవాదంపై ప్రధాని మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 'ఆపరేషన్ సింధూర్' గురించి చెబుతూ, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ఎలా ధ్వంసం చేసిందో వివరించారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ను ఖండించారు. ఉగ్రవాదం, వ్యాపారం, నీళ్ళు, రక్తం కలిసి ఉండవని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.

1- మన బలం, సంయమనం ప్రపంచం చూసింది. ఆపరేషన్ సింధూర్‌లో మన సైనికులు అసమాన ధైర్యం ప్రదర్శించారు. వారి పరాక్రమాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నా.

2- ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు చూపించిన క్రూరత్వం దేశాన్ని, ప్రపంచాన్ని కలచివేసింది. దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూసిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాం.

3- ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదంపై కఠిన చర్యలకు పిలుపునిచ్చింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.

4- మన సోదరీమణుల నుదుట నుంచి సింధూరం తుడిచేయడం వల్ల కలిగే పరిణామాలేంటో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికీ, ఉగ్రవాద సంస్థకూ తెలుసు.

5- ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు, కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల ప్రతిబింబం. మే 6 అర్ధరాత్రి, మే 7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాన్ని ప్రపంచం చూసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం దాడి చేసింది.

6- దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, దేశం ముందుంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, ఫలితాలు సాధిస్తాం.

7- పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు, డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాదుల ధైర్యం దెబ్బతింది. బహావల్‌పూర్, మురీద్కే వంటివి ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు.

8- ప్రపంచంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు ఈ స్థావరాలతో సంబంధం ఉంది.

9- ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం.

10- భారత్ చర్యతో పాకిస్తాన్ నిరాశకు, తీవ్ర నిస్పృహకు లోనైంది. మనపై దాడి చేసింది.

11- పాకిస్తాన్ మన పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, గురుద్వారాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది. కానీ అందులో కూడా ఓడిపోయింది.

12- పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు భారత్ ముందు ఎలా ధ్వంసమయ్యాయో ప్రపంచం చూసింది.

13- పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధానికి సిద్ధమైంది, కానీ భారత్ పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది.

14- భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ తప్పించుకునే మార్గాల కోసం వెతికింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత తగ్గించాలని వేడుకుంది.

15- పాకిస్తాన్ భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద, సైనిక చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చినప్పుడు మేము కూడా దానిని పరిగణించాము.

16- పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక స్థావరాలపై మా ప్రతిచర్యను మేము తాత్కాలికంగా నిలిపివేశాము. వారి తదుపరి చర్యలను మేము గమనిస్తాము.

17- భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానం.

18- ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త ప్రమాణాలను నిర్దేశించింది.

19- భారత్‌పై ఉగ్రవాద దాడి జరిగితే తగిన ప్రతిస్పందన ఉంటుంది.

20- ఎలాంటి అణు బెదిరింపులనూ భారత్ సహించదు.

21- ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాన్ని, ఉగ్రవాద నాయకులను మేము వేర్వేరుగా చూడము.

22- యుద్ధభూమిలో మేము పాకిస్తాన్‌ను ఓడించాము, ఈసారి ఆపరేషన్ సింధూర్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

23- ఈ ఆపరేషన్‌లో మన దేశీయ ఆయుధాల సామర్థ్యం రుజువైంది.

24- మనమందరం ఐక్యంగా ఉండాలి. మన ఐక్యతే మన బలం.

25- ఉగ్రవాదంపై సున్నా సహనం మంచి ప్రపంచానికి హామీ.

26- పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న తీరు ఒకరోజు పాకిస్తాన్‌నే నాశనం చేస్తుంది.

27- భారత్ వైఖరి స్పష్టంగా ఉంది - ఉగ్రవాదం, చర్చలు కలిసి ఉండలేవు. ఉగ్రవాదం, వ్యాపారం కలిసి నడవలేవు. నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవు.

28- పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం గురించి మాత్రమే.

29- నేడు బుద్ధ పూర్ణిమ. శాంతి మార్గాన్ని బుద్ధుడు మనకు చూపించాడు. ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలి, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి. అందుకే భారత్ బలంగా ఉండాలి. అవసరమైతే ఆ బలాన్ని ఉపయోగించాలి. గత కొన్ని రోజులుగా భారత్ అదే చేస్తోంది.

30- భారత సైన్యానికి, సాయుధ దళాలకు నా వందనాలు. భారత్ మాతాకీ జై.