మన దేశంలో 2030 కల్లా గిగ్ ఎకానమీ 2.35 కోట్ల ఉద్యోగాలు కల్పించనుంది: నీతి ఆయోగ్ నివేదిక
గిగ్ ఎకానమీ భారీ సంఖ్యలో ఉపాధి కల్పిస్తుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. 2029-30 కల్లా మన దేశంలో 2.35 లక్షల కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
న్యూఢిల్లీ: భారత దేశంలో గిగ్ ఎకానమీ 77 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2029-30 కల్లా ఈ సంఖ్య 2.35 లక్షల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని సోమవారం వివరించింది. నీతి ఆయోగ్ తొలిసారిగా గిగ్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ గురించి ఓ నివేదికను రూపొందించింది. అదే ‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ’ రిపోర్టు. గిగ్ వర్కర్ల సంఖ్యను తొలిసారి అంచనా వేసే ప్రయత్నం చేసింది. ఉద్యోగులు, యాజమాన్యం అనే వ్యవస్థకు బయట పని చేసే వర్కర్లనే గిగ్ వర్కర్లు అనవచ్చు. అంటే.. కంపెనీల యాజమాన్యాలతో తాత్కాలిక ఒప్పందాలతో పని చేసి వెళ్లిపోవడం లేదా ఫ్రీలాన్సింగ్ వర్కర్లను గిగ్ వర్కర్లుగా పరిగణించవచ్చు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2019 -20 లో గిగ్ వర్కర్లు 68 లక్షలు ఉండగా, 2020-21 కల్లా వీరి సంఖ్య 1.3 శాతం పెరిగి 77 లక్షలకు చేరింది. అంతేకాదు, 2029-30 కల్లా మొత్తం దేశ కార్మిక శక్తిలో 4.1 శాతం పెరుగుదలతో గిగ్ వర్కర్ల సంఖ్య 2.35 కోట్లకు చేరవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది.
రిటైల్ ట్రేడ్, సేల్స్ రంగాల్లో అత్యధికంగా గిగ్ వర్కర్లు పని చేస్తున్నారు. ఈ రంగాల్లో 27 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఎక్కువగా 13 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
కాగా, 77 లక్షల మంది గిగ్ వర్కర్లలో 31 శాతం మంది తక్కువ నైపుణ్యం గలవారేనని రిపోర్టు తెలిపింది. 47 శాతం మంది మీడియం స్కిల్స్ ఉన్నవారని, 22 శాతం మంది హై స్కిల్ ఉద్యోగులు అని వివరించింది. మీడియం స్కిల్స్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టూ తెలిపింది.
ఈ సెక్టార్ ప్రాధాన్యత, సామర్థ్యాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా గిగ్, ప్లాట్ఫమ్ వర్క్లపై పరిశోధనలు చేయడానికి, ముందుకు వెళ్లడాానికి ఈ రిపోర్టు ఉపయుక్తంగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి అభిప్రాయపడ్డారు. ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పెంచడానికి ఈ రిపోర్టు ఉపయోగ పడుతుందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ దిశగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రైనింగ్ ప్రొవైడర్స్, ప్లాట్ఫామ్ కంపెనీలు, ఇతర భాగస్వామ్యులు కలిసి పని చేసి సత్ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు.