Maharashtra Crisis: "భద్రతా బలగాలను మోహరించండి".. కేంద్రానికి 'మహా' గవర్నర్ లేఖ
Maharashtra Crisis:మహారాష్ట్రలో కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
Maharashtra Crisis: మహారాష్ట్రలో ఆందోళనకరంగా పరిస్థితులు నెలకొన్నాయనీ, రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసైనికులు దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తగినన్ని కేంద్ర భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఇద్దరు ప్రహర్ జనశక్తి పార్టీకి చెందిన సభ్యులు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఉపసంహరించుకుందని పేర్కొంటూ కోష్యారి తెలిపారు. మహా వికాస్ అఘాడి (MVA) నుండి సేన నిష్క్రమించాలని డిమాండ్ చేస్తూ.. ఇతర సమస్యలను లేవనెత్తుతూ పార్టీ సీనియర్ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ముప్పు తెచ్చిందని అని తెలిపారు.
"కొందరు రాజకీయ నాయకులు రెచ్చగొట్టే, బెదిరింపు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రెబల్స్ నాయకుల ఇళ్ళు, కుటుంబాల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలకు తక్షణమే తగిన పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు గవర్నర్ తెలిపారు.
అయినా.. కొంతమంది ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇండ్లపై దాడులు జరుగుతున్నాయనీ, పోలీసులు మూగప్రేక్షకుడిగా ఉన్నారని ఆరోపించారు. తదనుగుణంగా, పరిస్థితిని పరిష్కరించడానికి అవసరమైతే, కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని ఆయన చెప్పారు.
అంతకుముందు, COVID-19 నుండి కోలుకున్న తర్వాత గవర్నర్.. ముంబైలోని ఆసుపత్రి నుండి ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఒక రోజు ముందు.. MVA ప్రభుత్వం తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే తనతో సహా 38 మంది పార్టీ తిరుగుబాటుదారుల నివాసాలకు, వారి కుటుంబాలకు భద్రతను ఉపసంహరించుకుందని ఆరోపించాడు. ఈ చర్యను "రాజకీయ ప్రతీకారం"గా పేర్కొన్నాడు, అయితే హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అలాంటిదేమీ ఖండించలేదు.
జూన్ 22 నుంచి MVA ప్రభుత్వంపై రెబల్స్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో.. ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తొలుత జూన్ 21న ముంబై నుంచి సూరత్కు.. మరుసటి రోజు గౌహతికి చేరుకుంది. అప్పటి నుండి.. గౌహతి కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు జరుగుతున్నాయి. పలు నేతలతో చర్చలు, భేటీలు, సమావేశాలు నిర్వహిస్తూ.. మహారాష్ట్ర సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నారు రెబల్ నేతలు.
రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
షిండేతో సహా 16 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటేరియట్ వారికి శనివారం సమన్లు జారీ చేసింది. ఈ రెబల్స్ ఎమ్మెల్యేలు జూన్ 27 సాయంత్రంలోగా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. విలీనం ఒక్కటే మార్గం, కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుండి తప్పించుకోలేరు ఎందుకంటే ఈ వ్యక్తులు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ విలీనం కాలేదు. నోటీసు అందిన తరువాత, ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం నుండి నోటీసుపై స్పందించడానికి వివిధ ఎంపికలపై చర్చిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.