ఆగ‌స్టు 23వ తేదీ జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంత‌రిక్ష రంగంలో భార‌త్ సాధించిన ఘ‌న‌త‌లు, భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల గురించి వివ‌రించారు. 

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం భారత్ అంతరిక్ష ప్రయాణంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుస విజయాలు భారత్‌కి అలవాటుగా మారాయని ఆయన గర్వంగా తెలిపారు. భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

చంద్రయాన్ నుంచి గగనయాన్ వరకు

ప్రధాని మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిందని గుర్తుచేశారు. రాబోయే గగనయాన్ మిషన్ ఈ ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ‘వికసిత్ భారత్’ ప్రతిష్టను ప్రదర్శిస్తారని మోదీ స్పష్టం చేశారు.

భవిష్యత్ ప్రణాళికలు

భవిష్యత్తులో ఏడాదికి కనీసం 50 రాకెట్లు ప్రయోగించే సామర్థ్యాన్ని సాధించగలమా అని శాస్త్రవేత్తలను మోదీ ప్రశ్నించారు. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలో గగనయాన్ మిషన్ ప్రారంభమవుతుందని, కొన్నేళ్లలో భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ రంగం కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Scroll to load tweet…

కొత్త వ్యోమగాముల తరం తయారీ

ఇస్రో ఇప్పటికే రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు. ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారు. గగనయాన్ మిషన్ కింద ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను అంత‌రిక్షంలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తిరిగి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నారు.

భవిష్యత్తులో మరింత లోతైన అంతరిక్ష పరిశోధనల కోసం భారత్ సిద్ధమవుతోందని ప్రధాని తెలిపారు. శుక్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం, అంగారకుడిపై ల్యాండర్‌ను దింపడం వంటి కార్యక్రమాలు ముందున్నాయని వెల్లడించారు. అంతరిక్ష రంగం అభివృద్ధికి ఇది కీలకమని పేర్కొన్నారు.