ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉంది : ముస్లిం పర్సనల్ లా బోర్డు
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) తెలిపింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టుకు వివరించింది.

మసీదుల్లోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ప్రవేశించడానికి స్వేచ్ఛ ఉందని, మసీదులో ప్రార్థనలు చేసే హక్కును వినియోగించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టమని , ఇస్లాం మత గ్రంథాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఇదే చెబుతున్నాయని బోర్డు పేర్కొంది. ఈ మేరకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖాలు చేసింది.
లాయర్ ఏం చెప్పారు?
న్యాయవాది MR శంషాద్ ద్వారా దాఖలు చేయబడిన అఫిడవిట్ లో ప్రార్థనా స్థలాలు పూర్తిగా ప్రైవేట్ సంస్థలు , మసీదులు నిర్వాహకులు నియంత్రణలో ఉన్నాయని పేర్కొన్నారు. షేక్ ఫర్హా అన్వర్ హుస్సేన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో 2020లో ఓ పిటిషన్ వేశారు. భారత్లోని మసీదుల్లో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్నదని, ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మార్చిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అఫిడవిట్లో ఏముంది?
AIMPLB అనేది నిపుణుల సంఘం అని, దానికి ఎలాంటి అధికారాలు లేవని, ఇస్లాం సూత్రాలపై సలహాలు మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సూత్రాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని అఫిడవిట్ పేర్కొంది.
ఇస్లాం సూత్రాల ప్రకారం.., ముస్లిం మహిళలు ఇంట్లో నమాజ్ చేసినా లేదా మసీదులో నమాజ్ చేసినా, వారికి సమానమైన సవాబ్ (పుణ్యం) లభిస్తుందని పేర్కొంది. అదే సమయంలో నమాజ్ కోసం ఏ మసీదులోనైనా పురుషులు, స్త్రీలు ఒకేస్థలంలో స్వేచ్ఛగా మిళితం అవడాన్ని ముస్లిం మత గ్రంథాలేవీ చెప్పడం లేదని పేర్కొన్నది. మదీనా మసీదులోనూ పురుషులు, స్త్రీలకు వేర్వేరు స్థలాలను కేటాయించినట్టు తెలిపింది.