పంజాబ్ సరిహద్దుల్లో డ్రగ్స్, ఆయుధాలను జారవిడిచిన పాక్ డ్రోన్.. స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్..
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ఆయుధాలు, మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ఆయుధాలు, మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒక అధికారి వివరాలను వెల్లడించారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని సరిహద్దు పోస్ట్ ఎండబ్ల్యూ ఉత్తర్ ప్రాంతంలో గురువారం- శుక్రవారం మధ్య రాత్రి భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్పై సైనికులు కాల్పులు జరిపారు.
అనంతరం బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా.. డ్రోన్ ద్వారా జారవిడిచిన సుమారు 3 కిలోల హెరాయిన్, ఒక చైనీస్ పిస్టల్, ఐదు గుళికలు, మ్యాగజైన్తో కూడిన ప్యాకెట్ లభించిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు డ్రోన్ను స్వాధీనం చేసుకోలేదని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, ఇందుకు సంబంధించిన వివరాలను బీఎస్ఎఫ్.. ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. . పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో బుధవారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్ తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించి బీఎస్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి 9:40 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అడియా సరిహద్దు ఔట్పోస్ట్ సమీపంలో డ్రోన్ కనిపించిందని ఒక అధికారి తెలిపారు. బీఎస్ఎఫ్ దళాలు పాకిస్థాన్ డ్రోన్పై 16 రౌండ్లు కాల్పులు జరిపాయని చెప్పారు. ఇల్యూమినేషన్ బాంబును కూడా ఉపయోగించాయని అధికారి తెలిపారు. ఇక, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ చొరబాటు ఘటనలు పెరిగిన సంగతి తెలిసిందే.