- Home
- National
- Railways Rules: రైలు దిగిన తర్వాత స్టేషన్లో ఎంతసేపు ఉండొచ్చు? చాలా మందికి తెలియని రూల్స్ ఇవే
Railways Rules: రైలు దిగిన తర్వాత స్టేషన్లో ఎంతసేపు ఉండొచ్చు? చాలా మందికి తెలియని రూల్స్ ఇవే
Railways Rules: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్ గురించి మనలో చాలా మందికి కొన్ని ముఖ్యమైన నియమాలు తెలియవు. ముఖ్యంగా రైలు దిగిన తర్వాత స్టేషన్లో ఎంతసేపు ఉండవచ్చనే విషయంలో ఎక్కువ మందికి స్పష్టత ఉండదు.

ఎంత సమయం అనుమతి ఉంటుంది.?
రైలు దిగిన తర్వాత స్టేషన్లో ఉండేందుకు భారతీయ రైల్వే చట్టాల్లో కచ్చితమైన సమయ పరిమితిని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ రైల్వే స్టేషన్లలో అమల్లో ఉన్న సాధారణ నియమాల ప్రకారం ప్రయాణికులు తమ జర్నీ టికెట్ ఆధారంగా కొంతసేపు స్టేషన్ ప్రాంగణంలో ఉండవచ్చు. సాధారణంగా పగటిపూట రైలు దిగిన తర్వాత రెండు గంటల వరకు ప్లాట్ఫామ్ లేదా స్టేషన్లో ఉండేందుకు అనుమతి ఇస్తారు. కొన్ని పెద్ద స్టేషన్లలో రాత్రి సమయంలో ఈ పరిమితి ఆరు గంటల వరకు ఉండొచ్చు. అయితే ఇది ప్రతి స్టేషన్లో ఒకేలా ఉండదు. స్థానిక రైల్వే అధికారుల నిర్ణయం కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. అనుమతించిన సమయానికి మించి స్టేషన్లో ఉండాలనుకుంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తారు. లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

వెయిటింగ్ రూమ్ను ఎవరు ఉపయోగించవచ్చు?
చాలా రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ రూమ్ సౌకర్యం ఉంటుంది. రైలు ఆలస్యమైతే లేదా తదుపరి రైలు కోసం వేచి ఉండాల్సి వస్తే ప్రయాణికులు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. సాధారణంగా బయలుదేరే ప్రయాణికులకే ఈ సదుపాయం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ట్రైన్ బయలుదేరే ముందు కొన్ని గంటల నుంచి వెయిటింగ్ రూమ్లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. రాత్రి సమయంలో వచ్చిన ప్రయాణికులు ఉదయం వరకు అక్కడ ఉండేందుకు కొన్ని స్టేషన్లు అనుమతిస్తాయి. కానీ పగటి రైళ్లతో వచ్చినవారికి ఈ సౌకర్యంపై పరిమితులు ఉండొచ్చు. అందుకే స్టేషన్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకోవడం మంచిది.
రిటైరింగ్ రూమ్ అంటే ఏమిటి?
కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కువసేపు స్టేషన్ దగ్గరే ఉండాల్సి వస్తే ప్రయాణికులు ఈ గదులను బుక్ చేసుకోవచ్చు. ఇవి హోటల్ గదుల మాదిరిగానే ఉంటాయి. కొన్ని గంటల నుంచి రెండు రోజుల వరకు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైలు టికెట్ లేదా పీఎన్ఆర్ నంబర్ చూపించి ఆన్లైన్లో IRCTC ద్వారా లేదా స్టేషన్ కౌంటర్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బయట హోటళ్లతో పోలిస్తే చాలా స్టేషన్లలో ఈ ధరలు తక్కువగా ఉంటాయి.
టికెట్ను వెంటనే పారేయకండి
చాలామంది రైలు దిగిన వెంటనే టికెట్ను పారేస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. స్టేషన్ బయటకు వెళ్లే వరకు టికెట్ లేదా మొబైల్లో వచ్చిన మెసేజ్ను దగ్గర ఉంచుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో రైల్వే అధికారులు లేదా భద్రతా సిబ్బంది టికెట్ చూపించమని అడగవచ్చు. అలాంటప్పుడు అది ఉపయోగపడుతుంది. అలాగే రిటైరింగ్ రూమ్, వెయిటింగ్ రూమ్ వంటి సౌకర్యాలు ఉపయోగించాలన్నా వాలిడ్ టికెట్ అవసరం అవుతుంది. అందుకే ప్రయాణం పూర్తిగా ముగిసే వరకు టికెట్ను భద్రంగా ఉంచుకోవడం ఉత్తమం.

