అప్పుడు రూ. 6 వేలు, ఇప్పుడు రూ. 26 వేలు.. ఆలయం కారణంగా 200 శాతం పెరిగిన భుముల ధరలు
Land: దాదాపు 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మంగళవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయోధ్యలో భూముల ధరల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రామ మందిరం తర్వాత అయోధ్యలో పెను మార్పు
అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా భూమి రేట్లు చాలా వేగంగా పెరిగాయి. ముందు సాధారణంగా ఉన్న ధరలు ఇప్పుడు పలుమార్లు ఎక్కువయ్యాయి. వచ్చే ఏడాదికి ఇంకా ఎంత పెరుగుతాయనే అభిప్రాయాలు రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి.
అంతకు ముందు భూమి రేట్లు ఎలా ఉండేవి?
మందిర పనులు ప్రారంభం కాకముందు అయోధ్యలో భూమి ధరలు పెద్దగా మారేవి కావు. సర్కిల్ రేటు ప్రకారం ముఖ్య ప్రాంతాల్లో: చదరపు మీటర్కు రూ. 6,650 నుంచి రూ. 6,975 వరకు ఉండేది. మార్కెట్ డిమాండ్ ఉన్న కొన్ని చోట్ల రూ. 8000 వరకు ఉండేది. అప్పుడు పర్యాటక అభివృద్ధి అవకాశాలు స్పష్టంగా కనిపించకపోవడంతో భూమి ధరలు పెద్దగా ఆకర్షణీయంగా అనిపించేవి కావు.
మందిరం నిర్మాణం తర్వాత భారీ పెరుగుదల
రామ్ మందిరం ప్రాంతంలో పర్యాటకం, అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పెరగడంతో భూమి రేట్లలో భారీగా పెరుగుదల కనిపించింది. ఆలయ నిర్మాణానికి ముందు రూ. 6,650 నుంచి రూ. 6,975గా ఉన్నచదరపు మీటర్ భూమి ధర ప్రస్తుతం రూ. 26,600 నుంచి రూ. 27,900 వరకు పలుకుతోంది. తిహురా మాంఝాలో వ్యవసాయ భూమి సర్కిల్ రేటులో హెక్టార్ భూమి ధర సుమారు రూ. 69 లక్షల వరకు పలుకుతోంది.
రేట్లు ఎందుకు ఇంత వేగంగా పెరిగాయి?
భూమి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:
* రామ మందిరం కారణంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం
* హోటళ్లు, గెస్ట్ హౌసులు, వ్యాపారం పెరగడం
* ప్రధాన రోడ్ల విస్తరణ, కొత్త అభివృద్ధి పనులు శరవేగంగా జరగడం.
* పెట్టుబడిదారులకు ఈ ప్రాంతం ఆకర్షణీయంగా మారడం.
* దీంతో భూమి రేట్లు సహజంగానే పైకి దూసుకెళ్లాయి.
స్థానికులపై ప్రభావం
భూమి ఉన్న వారికి ఈ పెరుగుదల మంచి అవకాశంగా మారింది. చాలా మంది మంచి లాభంతో విక్రయించారు. అయితే సాధారణ ప్రజలకు కొత్తగా భూమి కొనడం ఇప్పుడు కష్టంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రామ మందిరం దగ్గర ప్రాంతాల్లో రేట్లు రానున్న రోజుల్లో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పర్యాటకం నిలకడగా పెరుగుతున్నంతకాలం భూమి విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుందని భావిస్తున్నారు.

