- Home
- Telangana
- దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్.. సర్కార్ నిర్ణయంతో ఈ ప్రాంత ప్రజల సుడి మారడం ఖాయం
దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్.. సర్కార్ నిర్ణయంతో ఈ ప్రాంత ప్రజల సుడి మారడం ఖాయం
Hyderabad: మంగళవారం నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో పలు మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుంది. దీంతో జరిగే లాభాలు ఏంటంటే.?

జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలు
హైదరాబాద్ చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కొన్ని పురపాలికలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీలు హైదరాబాద్లో విలీనం కానున్నాయి. జిల్లావారీగా చూస్తే..
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్
రంగారెడ్డి జిల్లా: బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల, తుక్కుగూడ
సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్
దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్
ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా రూపాంతరం చెందనుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్ తర్వాతే ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 625 చ.కి.మీ., 1.45 కోట్ల జనాభాతో ఉంది.
దీంతో జరిగే లాభం ఏంటి.?
అవుటర్ రింగ్ రోడ్డు లోపలున్న ప్రాంతాలు GHMC పరిధిలోకి రావడం వల్ల పలు రంగాల్లో పురోగతి వేగవంతమవుతుంది. ముఖ్యంగా..
* భారీ స్థాయి మౌలిక వసతుల ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతుంది.
* జోన్ సంబంధిత నిర్ణయాలు త్వరగా పూర్తవుతాయి.
* ఉన్నత స్థాయి సివిక్ సేవల అందుబాటులోకి వస్తాయి.
* ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ మరింత మెరుగవుతాయి.
ఈ మార్పులు మొత్తం ప్రాంతాన్ని డెవలప్మెంట్ కారిడార్గా మార్చడంలో ఉపయోగపడతాయి. అలాగే భూములు విలువలు పెరుగుతాయి. కమర్షియల్ డిమాండ్ పెరగడంతో పెద్ద ప్రాజెక్టులకు అవకాశాలు తెస్తాయి. ఇక ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జీవితాల్లో కచ్చితమైన మార్పులు కనిపిస్తాయి.
కొత్త పెట్టుబడి అవకాశాలు
విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత హైదరాబాద్ మెగా సిటీలా మారిపోతుంది. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశం పెరుగుతుంది. అనుమతుల ప్రక్రియలు సులభతరం అవుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక పోటీతత్వాన్ని బలపరుస్తుంది.
పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతుంది
GHMC పరిధి పెరగడం వల్ల బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీ రంగాల్లో విశ్వాసం పెరుగుతుంది. మొత్తం మీద ఈ నిర్ణయం హైదరాబాద్ను దేశంలోనే వేగంగా ఎదుగుతున్న మెట్రోల్లో ఒకటిగా మరింత బలోపేతం చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. దీనికి తోడు ట్రిపులార్ నిర్మాణం కూడా మొదలవుతుండంతో అవుట్ రింగ్ రోడ్డుకు, ట్రిపులార్కు మధ్య చిన్న చిన్న టౌన్ షిప్స్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

