Bus Accident: మరో స్లీపర్ బస్సు ప్రమాదం.. 17 మంది సజీవ దహనం
Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఓ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం
కర్ణాటక రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.
లారీ ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు
వేకువ జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఓ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతి అయింది. లారీ కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది.
సజీవ దహనమైన ప్రయాణికులు
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటకు రాలేకపోయారు. ఇప్పటివరకు 17 మంది సజీవ దహనమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire#chitradurga#karnatakapic.twitter.com/Fdpe5Tg999
— Naik Kartik (@mekartiknaik) December 24, 2025
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బస్సు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

