Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో కుట్ర కోణం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలడంతో ఏకంగా 241 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు
జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం విషాదకర మలుపు తిరుగుతోంది. ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్న దానిపై కేంద్ర ప్రభుత్వం, విమాన దర్యాప్తు సంస్థలు విస్తృతంగా విచారణ చేపట్టాయి. ఈ ప్రమాదంలో కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. దీంతో ఇప్పుడీ అంశం మళ్లీ దేశ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బ్లాక్ బాక్స్ విశ్లేషణ
ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానానికి చెందిన ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ను అధికారులు విజయవంతంగా గుర్తించి, ఢిల్లీలో విశ్లేషిస్తున్నారు. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది.
అమెరికా NTSB, బ్రిటన్ ఎయిర్ క్రాష్ విశ్లేషకులు కూడా ఈ పనిలో భాగస్వాములు అయ్యారు. విమానం టేకాఫ్ అయిన దాదాపు 33 సెకన్ల వ్యవధిలో ఏం జరిగిందన్న విషయాన్ని ఈ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా జరగడం అరుదైన ఘటన
AI-171 పైలట్ టేకాఫ్ అనంతరం "నో త్రస్ట్... మేడే!" అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్లుగా రికార్డుల్లో వెల్లడైంది. అంటే ఇంజిన్ పవర్ పూర్తిగా పోయినట్లు. అయితే రెండు ఇంజిన్లు ఒకేసారి నిలిచిపోవడం అత్యంత అరుదైనది. ఇది సహజంగా జరగకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ కోణాన్ని బలంగా పరిశీలిస్తున్న అధికారులు ఫ్యూయల్లో ఏమైనా కలుషితం జరిగిందా, ఫ్లైట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ విఫలమైందా, సాంకేతిక తప్పిదం లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిన విధ్వంస చర్యలవైపు దృష్టిసారించారు.
సీవీఆర్, ఎఫ్డీఆర్, సీసీటీవీల ఆధారంగా విచారణ
జూన్ 12న మధ్యాహ్నం 1.38 గంటలకు విమానం టేకాఫ్ అయిన కేవలం 33 సెకన్లలోనే క్రాష్ అయ్యింది. అధికారులు విమాన ప్రయాణానికి ముందు, టేకాఫ్ సమయంలో, తరువాత చోటుచేసుకున్న ప్రతి క్షణాన్ని పునర్నిర్మించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టాప్స్, సీసీటీవీ ఫుటేజీలు, వాతావరణ నివేదికలు, పైలట్ గ్లోబల్ పొజిషనింగ్ డేటా తదితర ఆధారాలను విశ్లేషిస్తున్నారు.
పక్షులు ఢీ కొట్టడం ద్వారా ప్రమాదం జరిగి ఉండొచ్చన్న కోణాన్ని ఇప్పటికే కొట్టేశారు. కానీ టెక్నికల్ ఫెయిల్యూర్ సంబంధిత ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్న అనేక ఏజెన్సీలు
ఈ దుర్ఘటనపై అనేక సంస్థలు పని చేస్తున్నాయి. AAIB, DGCA, NTSB (అమెరికా), UK ఎయిర్ క్రాష్ బోర్డ్, జీఈ (ఇంజిన్ తయారీ సంస్థ), CISF, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, పోలీసు శాఖలు కలిసి సమిష్టిగా విచారణ చేపట్టాయి. ఈ ప్రమాదంతో సంబంధం లేనప్పటికీ దేశంలోని మిగిలిన అన్ని బోయింగ్ 787 విమానాలను డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిఘా పెట్టి, వెంటనే సాంకేతిక పరిశీలన చేపట్టింది.
మూడు నెలల్లో నివేదిక
ఈ దుర్ఘటనపై ప్రాథమిక నివేదికను మూడు నెలల లోపు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాతే అసలు కారణం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. విమానంలో జరిగిన లోపాల కారణంగా.? లేక మానవ తప్పిదమా.? ఉద్దేశపూర్వక విధ్వంస చర్యే అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.