- Home
- Life
- Health
- Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
ప్రస్తుతం చాలామంది రోజూ ఉదయాన్నే జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగుతున్నారు. అయితే ఈ డ్రింక్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేక ఏమైనా సమస్యలు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

జీలకర్ర, సోంపు, వాము వాటర్ ప్రయోజనాలు
ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర, సోంపు, వాము కలిపిన నీరు తాగడం ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది. చాలామంది ఈ డ్రింక్ తాగుతున్నారు.. ఇతరులను తాగమని కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే వంటింటి పదార్థాలైన ఈ మూడు దినుసుల మిశ్రమం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? 11 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
మెరుగైన జీర్ణక్రియకు..
ఆరోగ్య నిపుణుల ప్రకారం జీలకర్రలో ఉండే థైమాల్ వంటి సంయోగాలు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జీర్ణక్రియ సాఫీగా సాగడంలో సహాయపడతాయి. వాములోని కార్వక్రాల్ అనే పదార్థం గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మూడు కలిపిన నీరు తాగడం వల్ల కొంతమందికి ఉదయం మలబద్ధకం తగ్గడం, కడుపు తేలికగా అనిపించడం వంటి ప్రయోజనాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మోతాదు ముఖ్యం
అయితే నిపుణులు మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతున్నారు. వారి ప్రకారం.. ప్రతి సహజ పదార్థం అందరికీ ఒకే విధంగా పనిచేయదు. అసిడిటి ఎక్కువగా ఉండే వ్యక్తులు వాము అధికంగా తీసుకుంటే కడుపులో మంట లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాగే లో బీపీ ఉన్నవారు అధిక పరిమాణంలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే తలనొప్పి లేదా అలసటగా అనిపించవచ్చు. కాబట్టి పరిమిత మోతాదులోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు నియంత్రణకు..
నిపుణుల ప్రకారం ఈ నీరు తాగిన వెంటనే కొవ్వు కరిగిపోదు. కానీ ఉదయం ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. రోజంతా తక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రింక్ పరోక్షంగా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. కానీ కేవలం ఈ మిశ్రమం వల్లే బరువు తగ్గుతారని ఆశించడం కరెక్ట్ కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర వంటివి కలిపి పాటించినప్పుడే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
విషపదార్థాలు బయటకు..
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. 11 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు తొలగిపోతాయి. శరీరంలో కాలేయం, మూత్రపిండాలు సహజంగానే విషపదార్థాలను తొలగిస్తాయి. ఈ మిశ్రమం వాటి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్ సలహా తప్పనిసరి..
అలెర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగే ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. డ్రింక్ తాగినప్పుడు అసౌకర్యం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

