Kitchen Hack: కూరగాయలు ఇలానే కడగాలి, లేదంటే ఏమౌతుందో తెలుసా... !
Kitchen Hack: మనం శుభ్రం చేశామని అనుకుంటున్న కూరగాయలు నిజంగా అంత శుభ్రమవుతున్నాయా? ఒకసారి నీటితో కడిగితే సరిపోతుందని అనుకోవడం పెద్ద పొరపాటు. మనం చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలా కడగాలి? వాటిని ఎలా జాగ్రత్త పరచాలి?

కూరగాయలను ఒకసారి కడిగితే చాలా?
కూరగాయలను కేవలం నీటితో ఒకసారి కడిగితే చాలనుకుంటాం. కానీ పంటల సమయంలో వాడే పురుగుమందులు, మట్టి, సూక్ష్మజీవులు వంటి మలినాలు వాటి ఉపరితలంపై ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో పూర్తిగా అన్ని రసాయనాలను తొలగించడం సాధ్యం కాకపోయినా, సరైన పద్ధతిలో కడిగితే ఉపరితల మలినాలను తగ్గించవచ్చు.
కూరగాయలు శుభ్రం చేయడానికి సింపుల్ చిట్కా
ఇందుకు సులభమైన, అందరికీ అందుబాటులో ఉన్న పరిష్కారం..ఉప్పు నీరు. సరైన మోతాదు, సమయం పాటిస్తే రుచికి హాని లేకుండా కూరగాయలను మరింత శుభ్రం చేసుకోవచ్చు.
ఉప్పు నీరు ఎలా పనిచేస్తుందంటే...ఉప్పు నీరు స్వల్ప హైపర్టోనిక్ ద్రావణంగా పనిచేస్తుంది. కూరగాయల పైపొరలపై ఉన్న దుమ్ము, మట్టి పోతుంది. చిన్న పురుగులు బయటకు రావడానికి సహాయపడుతుంది. కొంతమేర పురుగుమందుల ఉపరితల అవశేషాలను తగ్గిస్తుంది. అయితే, ఉప్పు నీరు లోపలికి చొచ్చుకుపోయిన రసాయనాలను తొలగించదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉప్పు నీటితో కడిగితే కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి
ఉప్పుతో కూరగాయలు ఎలా శుభ్రం చేయాలంటే...ఒక పెద్ద గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకుని, ప్రతి లీటర్ నీటికి 1–2 టీ స్పూన్లు సాధారణ ఉప్పు కలపాలి. ఉప్పు పూర్తిగా కరిగే వరకు కలపాలి. నీరు తేలికగా ఉప్పుగా ఉండాలి. కూరగాయలను మొదట మామూలు నీటిలో కడగాలి. అలా చేస్తే పైపొరలో ఉన్న మట్టి తొలగి, నానబెట్టే నీరు త్వరగా మురికిగా మారదు. 10–15 నిమిషాలు నానబెట్టడం
కూరగాయలను పూర్తిగా ఉప్పు నీటిలో ముంచి 10 నుంచి15 నిమిషాలు ఉంచాలి. ఆకు కూరలైతే ఆకులను విడదీసి నీరు లోపలికి చేరేలా చేయాలి.
రెండోసారి మంచినీటితో కడగాలి
బంగాళాదుంప, దోసకాయ, వంకాయ వంటి గట్టిగా ఉండే కూరగాయలను చేతులతో మెల్లగా రుద్దాలి. మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి. ఉప్పు నీటిలోనుండి తీసిన తర్వాత తప్పనిసరిగా శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇది మిగిలిన ఉప్పు, మలినాలు తొలగించడానికి అవసరమవుతుంది. ఆ తర్వాత ఆరబెట్టాలి. కూరగాయలను జల్లెడలో వడకట్టి అదనపు నీరు తొలగించాలి. అవసరమైతే గుడ్డతో తుడవాలి. ఆరిన కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి.
ఆకుకూరల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి
ఈ పద్ధతి పాలకూర, మెంతికూర, లెట్ట్యూస్ వంటి ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోసకాయ, వంకాయ, క్యాప్సికమ్ వంటి గట్టి తొక్క ఉన్నవాటికి ఉపయోగపడతాయి.
ఇందులో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే...ఉప్పు నీరు కేవలం ఉపరితల అవశేషాలను మాత్రమే తగ్గిస్తుంది. లోపలికి చొచ్చుకుపోయిన పురుగుమందులను పూర్తిగా తొలగించదు. బయట పొర తొలగించడం, పై ఆకులు తీసేయాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ముఖ్యంగా మృదువైన ఆకు కూరలు పాడైపోతాయి. ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత నేరుగా వండకూడదు. తప్పనిసరిగా మళ్లీ కడగాలి.
కొద్దిగా ఉప్పు, శుభ్రమైన నీరు, ఇంకా కొన్ని నిమిషాల సమయం అంతే. ఈ చిన్న అలవాటు ద్వారా మన రోజువారీ కూరగాయలను మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా తాజాగా ఉంటుంది.
