హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
హైదరాబాద్ లో తాజాగా పోలీసులు, ఫుడ్ సెప్టీ అధికారులు పండ్ల గోదాంలపై జరిపిన దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. తియ్యతియ్యని మామిడిపళ్ల వెనక ఎంతటి విషం దాగుందో తేలిపోయింది.

మామిడిపండ్లు కావివి... విష పదార్థాలు..!
వేసవి వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో లభించే ప్రతి పండు సహజంగా పండినది కాదని మీకు తెలుసా? అధిక లాభాల కోసం వ్యాపారులు రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను బలవంతంగా పండిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ విపరీతంగా వాడుతున్నారు. ఇలా తియ్యతియ్యని మామిడిపండ్లను స్వలాభం కోసం విషంలా మార్చేస్తున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదకమైన దందా బయటపడింది.
ప్రస్తుతం మామిడి కాయల సీజన్ కొనసాగుతోంది... కానీ హైదరాబాద్ మామిడి పండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఇది ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు ఫుడ్ సెప్టీ అధికారులతో కలిసి పోలీసులు పలు పండ్ల గోడౌన్లపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదకరమైన కెమికల్స్ ని ఉపయోగించి కాయలు మంచి రంగుతో పక్వానికి వచ్చేలా చేస్తున్నారని గుర్తించారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పండ్లను మార్కెట్లోకి తోస్తున్న గోడౌన్స్ ను సీజ్ చేశారు.
కేవలం కార్బైడ్ మాత్రమే కాదు అనేక రసాయనాలను మామిడి కాయలను త్వరగా పండించేందుకు వాడతారు. ఇలాంటి పళ్లను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కృత్రిమంగా పక్వానికి వచ్చేలా వాడే రసాయనాలేవి..? ఇలాంటి పళ్లను ఎలా గుర్తించాలి..? తెలుసుకుందాం.
మామిడి కాయల్ని పండించేందుకు ఉపయోగించే రసాయనాలివే..
కాల్షియం కార్బైడ్ (Calcium Carbide): దీనిని సాధారణంగా 'కార్బైడ్' అని పిలుస్తారు. ఇది ఎసిటిలీన్ గ్యాస్ను విడుదల చేయడం ద్వారా కాయను త్వరగా పండించేలా చేస్తుంది. ఇందులో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర లోహాలు ఉంటాయి.
ఇథిలీన్ గ్యాస్/ ఎథెఫోన్ (Ethephon): ఇది ద్రవ రూపంలో లభిస్తుంది. పండ్లపై దీనిని స్ప్రే చేయడం ద్వారా లేదా గదుల్లో గ్యాస్ వదలడం ద్వారా పండ్లు పసుపు రంగులోకి మారేలా చేస్తారు. పరిమితి కంటే ఎక్కువ వాడటం వల్ల ఇది విషపూరితంగా మారుతుంది.
ఇతర స్ప్రేలు: పండ్లు నిగనిగలాడుతూ కనిపించడానికి కొన్ని రకాల మైనం (Wax) పూతలు, కృత్రిమ రంగులను కూడా ఉపయోగిస్తుంటారు. ఇవి చూసేందుకు బాగుంటాయి... కానీ లోపల పాడైపోయి ఉంటాయి.
రసాయనాలతో పండించిన మామిడిపళ్లతో అనర్థాలివే..
రసాయనాలతో పండిన పండ్లను తినడం వల్ల తక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నాడీ వ్యవస్థపై ప్రభావం: కాల్షియం కార్బైడ్లోని ఆర్సెనిక్, ఫాస్పరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణకోశ వ్యాధులు: ఈ పండ్లను తినడం వల్ల కడుపులో మంట, వికారం, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
చర్మ, శ్వాసకోశ సమస్యలు: రసాయనాల ప్రభావంతో చర్మంపై దద్దుర్లు రావడం, గొంతులో మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.
క్యాన్సర్ ముప్పు: దీర్ఘకాలంలో ఇలాంటి కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కృత్రిమంగా పండిన పండ్లను గుర్తించడం ఎలా?
రంగు : పండు మొత్తం ఒకే రకమైన పసుపు రంగులో ఉండి, లోపల మాత్రం పుల్లగా లేదా పచ్చిగా ఉంటే అది రసాయనాలతో పండినదిగా భావించాలి.
రుచి : కృత్రిమంగా పండిన పండులో సహజమైన తీపి ఉండదు. తిన్నప్పుడు నోటిలో స్వల్పంగా మంట అనిపించవచ్చు.
నీటిలో పరీక్ష : ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండు నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి.
జాగ్రత్త...
మామిడి పండ్లను తినేముందు కనీసం గంటసేపు నీటిలో నానబెట్టి, ఆపై బాగా కడిగి తొక్క తీసి తినడం వల్ల రసాయనాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. వీలైనంత వరకు విశ్వసనీయమైన రైతుల వద్ద లేదా సేంద్రీయ (Organic) పండ్లను కొనుగోలు చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
రుచి కంటే ఆరోగ్యం మిన్న. తళతళలాడే పండ్లను చూసి మోసపోకుండా, జాగ్రత్తలు పాటించి వేసవి మజాను ఆస్వాదించండి.

