Tourist Scam: యూరోపియన్ యూనియన్నే బురిడీ కొట్టించాడు.. ఇటలీలో బయటపడ్డ విచిత్రమైన స్కామ్
Fake Historical Site Scam: ఇటలీలో పేపర్లతో నకిలీ రోమన్ థియేటర్ కట్టి, అసలైనదని నమ్మించి కోట్లు నొక్కేశాడు ఒక కేటుగాడు. జూలియట్ ఇక్కడే ఉండేదంటూ కొత్త కథతో నకిలీ పర్యాటక ప్రాంతంతో మైండ్ బ్లాక్ అయ్యే మోసం ఇప్పుడు బయటపడింది.

రూ.4 వేల టికెట్.. నకిలీ చారిత్రక ప్రదేశం! ఇటలీలో బిగ్ స్కామ్
పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి? సరిగ్గా ఇలాంటి ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు ఒక కేటుగాడు. ప్లాస్టిక్, ఫైబర్, పేపర్లతో ఒక నకిలీ రోమన్ థియేటర్ కట్టేశాడు. అది వేల ఏళ్ల నాటి చారిత్రక ప్రదేశమని నమ్మించి పర్యాటకుల దగ్గర నుంచి వేలకు వేలు గుంజాడు. చివరికి అసలు విషయం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. ఈ విచిత్రమైన ఉదంతం ఇటలీలో వెలుగు చూసింది.
వేల ఏళ్ల నాటి చరిత్ర అని బురిడీ
రిపోర్టుల ప్రకారం.. ఈ విచిత్రమైన మోసం ఇటలీలోని విచెంజా నగరం సమీపంలో జరిగింది. ఫ్రాంకో మాలోసో 'వాన్ రోజెన్ఫ్రాంజ్' అనే 69 ఏళ్ల వ్యక్తి ఈ కథనంతటికీ సూత్రధారి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రోమన్ యాంఫీథియేటర్ను (ఓపెన్ ఎయిర్ థియేటర్) తాను కనుగొన్నానని ఈ కేటుగాడు ప్రచారం చేసుకున్నాడు. అది క్రీస్తు శకం 393 కంటే ముందటిదని గట్టిగా చెప్పేవాడు. నిజానికి అదంతా అతను సొంతంగా తయారు చేసుకున్న సెట్టింగ్ అని ఎవరూ ఊహించలేకపోయారు.
టికెట్ ధర రూ. 4 వేలు.. కల్పిత కథలు
ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చే ప్రతి పర్యాటక విజిటర్ నుంచి ఫ్రాంకో ఏకంగా 35 పౌండ్లు (మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4,000) ఎంట్రీ ఫీజుగా వసూలు చేసేవాడు. అక్కడికి వచ్చే పర్యాటకులకు రాతి స్తంభాలు, రాతి మెట్లు, పురాతన విగ్రహాలు, పక్కనే ఉన్న సరస్సును చూపిస్తూ బిల్డప్ ఇచ్చేవాడు. విజిటర్స్ పూర్తిగా నమ్మడానికి పెద్ద పెద్ద కల్పిత కథలు కూడా చెప్పేవాడు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కూడా ఈ ప్రదేశానికి వచ్చేవారని చెప్పేవాడు. అంతేకాదు, ప్రసిద్ధ నాటకం 'రోమియో అండ్ జూలియట్' లోని జూలియట్ కాపులెట్ తన యంగేజ్ ను ఈ ప్రదేశంలోనే గడిపిందని కథలు అల్లేశాడు.
ఈయూ యాప్లోనూ చోటు
ఫ్రాంకో తనను తాను ఒక సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా, ఆర్కెస్ట్రా కండక్టర్ అని చెప్పుకునేవాడు. అతను చెప్పే కథలు ఎంత ప్రభావవంతంగా ఉండేవి అంటే.. స్థానిక అధికారులు కూడా అతని మాటలు నమ్మి మోసపోయారు. చివరికి ఈ నకిలీ ప్రదేశాన్ని యూరోపియన్ యూనియన్ ఫండ్ చేసిన ఒక అధికారిక టూరిజం యాప్లో కూడా చేర్చారంటే అతను ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్థం చేసుకోవచ్చు. 2005లో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాచీన ప్రాంతం బయటపడిందని, ఇక్కడ గ్రీక్, రోమన్ కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రచారం చేశాడు.
అసలు రంగు బయటపడిందిలా..
అయితే 2016లో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ ప్రారంభించారు. పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగి పరిశోధించగా అసలు కుట్ర బయటపడింది. అక్కడ ఉన్న ఏ ఒక్క నిర్మాణం కూడా పురాతనమైనది కాదని తేలింది. విగ్రహాలు, స్తంభాలు అన్నీ ఫైబర్ గ్లాస్, పేపర్-మాషే వంటి ఆధునిక వస్తువులతో తయారు చేసినవి. పాతవిగా కనిపించడానికి వాటికి అలా రంగులు వేశారు. అక్కడ ఉన్న సరస్సును, కొండను కూడా అతనే సొంతంగా సమతలం చేయించాడని విచారణలో తేలింది.
పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం.. చివరకు జైలు శిక్ష
మాఫియా తనపై దాడి చేసిందని, కొడుకు తప్పిపోయాడని రకరకాల డ్రామాలు ఆడినా ఫ్రాంకోను చట్టం వదిలిపెట్టలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ఫ్రాంకో మాలోసోకి రెండు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష, 3,000 యూరోల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, అక్కడ ఉన్న నకిలీ నిర్మాణాలన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణం, నకిలీ కళాఖండాల తయారీ వంటి ఆరోపణలు నిరూపితం కావడంతో అతనికి ఈ శిక్ష పడింది.

