AC: వర్షంలో తడిసిన వెంటనే ఏసీలో కూర్చుంటున్నారా.? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా.?
AC: వర్షాకాలంలో వర్షంలో తడవడం చాలా సాధారణ విషయం. కానీ వర్షంలో పూర్తిగా తడిచిన వెంటనే నేరుగా ఏసీ గదిలోకి వెళ్లి కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తడి శరీరం ఒక్కసారిగా చల్లని గాలికి గురైతే మంచిది కాదని అంటున్నారు.

తడిసిన బట్టలు వెంటనే మార్చేయండి
వర్షంలో తడిచిన వెంటనే తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకండి. వీలైనంత త్వరగా పొడి బట్టలు ధరించండి. అలాగే తలను, జుట్టును కూడా బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. తల తడిగా ఉంటే శరీరానికి త్వరగా చలి తగిలి జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఏసీ ఉష్ణోగ్రతను చాలా తక్కువగా పెట్టొద్దు
వర్షంలో తడిచిన వెంటనే ఏసీని 18 లేదా 20 డిగ్రీల వంటి తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించకండి. నిపుణుల ప్రకారం 25°C నుంచి 28°C మధ్య ఉష్ణోగ్రత శరీరానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా చల్లదనం తగలకుండా శరీరం సహజంగా ఉష్ణోగ్రతకు అలవాటు పడుతుంది.
డ్రై మోడ్ ఉపయోగిస్తే మంచిది
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఏసీని 'కూల్ మోడ్'లో కాకుండా 'డ్రై మోడ్సలో ఉంచితే గదిలోని తేమ తగ్గుతుంది. దీంతో గది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే అధిక చల్లదనం కూడా ఉండదు.
గోరువెచ్చని నీళ్లు తాగండి
వర్షంలో తడిచిన తర్వాత చల్లని నీళ్లు లేదా చల్లని పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. వాటి బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరంలో వేడి నిలిచి ఉంటుంది. దీంతో బయట చల్లని వాతావరణం ప్రభావం శరీరంపై తగ్గుతుంది.
శరీరం పూర్తిగా ఆరిన తర్వాతే ఏసీలో ఎక్కువసేపు ఉండండి
వర్షంలో తడిచిన వెంటనే ఏసీ ముందు కూర్చోవడం కంటే ముందుగా శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తడి బట్టలు, తడి జుట్టుతో ఏసీలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, కండరాల బిగుతు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా శరీరాన్ని పొడిగా చేసుకుని, అవసరమైతే వేడి పానీయం తాగి తర్వాత ఏసీ గదిలో ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గమనిక: వర్షంలో తడవడం వల్ల ప్రతి ఒక్కరికీ అనారోగ్యం వస్తుందని చెప్పలేం. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే జలుబు లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు

