- Home
- National
- CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
CJP Instagram Movement: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఉద్యమం పీక్స్కు చేరింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా యువత సాధించిన డిజిటల్ విప్లవంగ నిపుణుల పేర్కొంటున్నారు. అసలు ఒక్క కామెంట్ కేంద్ర మంత్రిని కుర్చీ నుంచి దింపేసిలా ఎలా మారింది?

ఇన్స్టాలో మీమ్స్ వేస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తారా? సీజేపీ సృష్టించిన హిస్టరీ ఇదే
దేశ రాజకీయాల్లో.. ముఖ్యంగా కేంద్ర విద్యారంగంలో సంచలనం నమోదైంది. కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వార్తల్లో నిలిచింది. గత రెండు నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనకు లభించిన అతిపెద్ద విజయంగా సీజేపీ దీనిని వర్ణించింది. సోషల్ మీడియాలో చిన్నగా మొదలైన ఒక క్యాంపెయిన్, అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్న యువత గొంతుకగా మారింది. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు కేవలం వినోదానికే కాదు, పవర్ ఫుల్ ప్రజా ఉద్యమాలకు కూడా అడ్డాగా మారగలవని ఈ సంఘటన నిరూపించింది.
ఒక్క కామెంట్తో మొదలైన విప్లవం
ఈ ఏడాది మే లో సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ వ్యాఖ్య ఆధారంగానే సీజేపీ, దానికి సపోర్టు గా ఉన్నవారు 'కాక్రోచ్' (బొద్దింక) అనే పదాన్ని తమ నిరసన సంకేతంగా మార్చుకున్నారు.
మరుసటి రోజే, అంటే మే 16న మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన అభిజీత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ని ప్రారంభించారు. బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి, పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అయిన దిప్కే దీనిని ఒక పొలిటికల్ సటైరికల్ మూవ్మెంట్గా అభివర్ణించారు. "Voice of the Lazy & Unemployed" అనే టాగ్ లైన్తో ఈ పార్టీని ప్రమోట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ లో మారిన పోరాటం
మే 17న @cockroachjantaparty పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ప్రారంభించారు. ఆరంభంలో మీమ్స్, రీల్స్, సటైరికల్ పోస్టులతో కుర్రాళ్లను ఆకట్టుకున్నారు. నిరుద్యోగం, నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలు, విద్యా వ్యవస్థలో లోపాలు, ద్రవ్యోల్బణం, యూత్ సమస్యలపై విపరీతంగా కంటెంట్ పోస్ట్ చేశారు.
కొద్ది రోజుల్లోనే ఈ అకౌంట్కు కోట్ల మంది ఫాలోవర్స్ పెరిగారు. వేలాది మంది యువకులు సీజేపీ వెబ్సైట్లో సభ్యత్వం తీసుకున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్, పోస్టర్లు, మెనిఫెస్టోలను రూపొందించడానికి చాట్ జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వాడటం గమనార్హం. చాలా తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ డిజిటల్ కంటెంట్ మిలియన్ల మంది యువతకు సులువుగా చేరువైంది.
సోషల్ మీడియా నుండి రోడ్లపైకి ఆందోళన
జూన్, జులై నెలలు వచ్చేసరికి ఈ ఉద్యమం ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ల నుండి ఢిల్లీ వీధుల్లోకి వచ్చింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీతో పాటు పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. నీట్ యూజీ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్లుగా మారాయి.
ఈ క్రమంలో 'ఛలో సంసద్' మార్చ్ కూడా నిర్వహించారు. ఒకవైపు జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, మరోవైపు ఇన్స్టాగ్రామ్లో డిజిటల్ క్యాంపెయిన్ సమాంతరంగా సాగాయి. పూర్తి వాలంటీర్ మోడల్లోనే ఈ ఉద్యమం నడిచిందని సీజేపీ స్పష్టం చేసింది.
ఇన్స్టా అకౌంట్ బ్లాక్.. మోదీ స్పెషల్ వీడియో
జూలైలో ఆందోళనలు తీవ్రమైన సమయంలో సీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజీ సడన్గా కనిపిచకుండాపోయింది. మెటా సంస్థ తమ అకౌంట్ను డిలీట్ చేసిందని అభిజీత్ దిప్కే ఎక్స్ లో ఆరోపించారు. తర్వాత ఆ అకౌంట్ పునరుద్ధరించబడినప్పటికీ, ఈ పరిణామం నేషనల్ వైడ్గా పెద్ద చర్చకు దారితీసింది.
ఇదే సమయంలో బుధవారం రాత్రి 11:52 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియో షేర్ చేశారు. ఫ్రంట్ కెమెరాతో వర్టికల్ ఫార్మాట్లో తీసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ 'మిత్రో' అని సంబోధించే మోదీ, ఈ వీడియోలో 'ఫ్రెండ్స్' అంటూ పలకరించారు. యువత ఎక్కువగా ఉండే ఇన్స్టాగ్రామ్ ద్వారా నేరుగా వారితో కనెక్ట్ కావడానికే మోదీ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరుసటి రోజు 24 గంటల వ్యవధిలోనే మోదీ మరో వీడియో పోస్ట్ చేసి, యూజర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్కు కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలైన సంబరాలు
జులై 25, 2026న కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ వార్త బయటకు రావడంతో జంతర్ మంతర్ వద్ద సీజేపీ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో మొదలైన ఒక వ్యంగ్య ప్రచారం దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రయాణమే ఉదాహరణ. అయితే తమ పోరాటం ఇంకా ముగియలేదని, విద్యావ్యవస్థలో సంపూర్ణ మార్పులు వచ్చే వరకు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తామని సీజేపీ స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో రాబోయే రోజుల్లో భారతీయ రాజకీయాలను ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లే ఏలబోతున్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

