- Home
- Feature
- ఒకే విద్యార్థి రెండు కాలేజీల యాడ్స్లో ఎలా.? కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల మాయాజలం తెలిస్తే దిమ్మదిరగాల్సిందే
ఒకే విద్యార్థి రెండు కాలేజీల యాడ్స్లో ఎలా.? కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల మాయాజలం తెలిస్తే దిమ్మదిరగాల్సిందే
Corporate College: ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే పత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియాలో కార్పొరేట్ కాలేజీల ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. అయితే ఒక కాలేజీ ప్రకటనలో కనిపించిన విద్యార్థే మరో కాలేజీ యాడ్లో ఎందుకు కనిపిస్తాడో తెలుసా

ఒకే ర్యాంకర్.. రెండు ప్రకటనలు.. అసలు కారణం ఏంటి?
సాధారణంగా తల్లిదండ్రులు ఒక విద్యార్థి ఏ కాలేజీ ప్రకటనలో కనిపిస్తే ఆ కాలేజీలోనే చదివి ఆ ర్యాంకు సాధించాడని భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలోనూ అదే వాస్తవం కావాల్సిన అవసరం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ప్రస్తుతం తమ విద్యా సేవలను కేవలం క్లాస్రూమ్లకే పరిమితం చేయకుండా, వివిధ మోడళ్ల ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను చేరుకుంటున్నాయి. ఫలితంగా ఒక విద్యార్థి తన రెగ్యులర్ విద్యను ఒక సంస్థలో కొనసాగిస్తూనే, మరో కార్పొరేట్ సంస్థ అందించే కోచింగ్ లేదా టెస్ట్ ప్రోగ్రామ్లో కూడా పాల్గొనవచ్చు. అందువల్ల ఆ విద్యార్థి పేరు రెండు వేర్వేరు ప్రకటనల్లో కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.
కార్పొరేట్ కాలేజీలు అనుసరించే మూడు విద్యా విధానాలు
ప్రస్తుతం కొన్ని కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా మూడు విధానాల ద్వారా విద్యార్థులకు కోచింగ్ అందిస్తున్నాయి.
క్లాస్రూమ్ కోచింగ్:
ఇది సంప్రదాయ విధానం. విద్యార్థి నేరుగా ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకుని, అక్కడే ఇంటర్మీడియట్తో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ పొందుతాడు. ఈ విధానంలో సాధించిన ర్యాంకులు ఆ కాలేజీ విద్యార్థులుగానే పరిగణిస్తారు.
ఆన్లైన్ ప్రోగ్రామ్:
ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించే కోచింగ్. విద్యార్థి ఏ కాలేజీలో చదువుతున్నా, ఆన్లైన్లో నమోదు చేసుకుని టెస్ట్ సిరీస్, ఆన్లైన్ క్లాసులు, సందేహ నివృత్తి వంటి సేవలు పొందవచ్చు. ఈ విద్యార్థులు ఆ కార్పొరేట్ కాలేజీలో రెగ్యులర్గా చదవకపోయినా, ఆ సంస్థ నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో భాగస్వాములవుతారు.
సీఐపీ (Coaching Centre Integrated Program):
ఈ విధానంలో విద్యార్థులు తమ స్థానిక కళాశాలల్లో లేదా ఇతర విద్యాసంస్థల్లో చదువుతుంటారు. అయితే వారికి అవసరమైన సిలబస్, స్టడీ మెటీరియల్, పరీక్షలు, అకడమిక్ ప్లానింగ్ వంటి అంశాలను కార్పొరేట్ కాలేజీ అందిస్తుంది. ఇందుకోసం స్థానిక కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉంటాయి. ఈ మూడు విధానాల ద్వారా ఒకే సంస్థ దేశంలోని అనేక ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన అకడమిక్ వ్యవస్థలో భాగస్వాములను చేస్తోంది.
ర్యాంకుల ప్రచారం వెనుక మార్కెటింగ్ వ్యూహం
ఈ మూడు విధానాల కారణంగా ఒక విద్యార్థి రెగ్యులర్గా మరో కాలేజీలో చదువుకున్నప్పటికీ, ఆన్లైన్ ప్రోగ్రామ్ లేదా ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో భాగస్వామి కావచ్చు. అతను మంచి ర్యాంకు సాధిస్తే, ఆ శిక్షణ అందించిన కార్పొరేట్ సంస్థ కూడా అతడిని తమ ఫలితాల ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే విద్యార్థి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల ప్రకటనల్లో కనిపిస్తాడు. తమ విద్యా సేవల పరిధిలో ఉన్న విద్యార్థుల విజయాలను ప్రచారం చేయడం ద్వారా సంస్థలు తమ బ్రాండ్ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని విద్యారంగ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అనేక మంది దీనిని ఒక మార్కెటింగ్ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు.
తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇదే
ర్యాంకుల ప్రకటనలు చూసి ఆకర్షితులై అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్నాయి. అయితే ప్రకటనల్లో కనిపించే ప్రతి ర్యాంకర్ ఆ కాలేజీలో రెగ్యులర్ క్లాస్రూమ్ విద్యార్థేనా? లేక ఆన్లైన్ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో భాగమా? అనే విషయాన్ని చాలామంది పరిశీలించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పులు చేసి చదివించడం మంచిదేనా.?
తమ పిల్లల్ని ఉన్నత చదువు చదివించాలని పేరెంట్స్ కోరుకోవడంలో తప్పులేదు. కానీ కేవలం ర్యాంకులను, ప్రకటనల జోరును చూసి మాత్రమే చేర్పించడం మంచిది కాదని ఈ ర్యాంకుల మాయాజాలం నిరూపిస్తోంది. విద్యార్థి ఏ విధానంలో శిక్షణ పొందాడు, ఆ సంస్థతో అతని సంబంధం ఏమిటి, ప్రకటనలో చూపిస్తున్న ఫలితం ఏ కేటగిరీకి చెందినది వంటి అంశాల్లో మరింత పారదర్శకత అవసరం అని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా ప్రకటనలను మాత్రమే నమ్మి అప్పులు చేసి మరీ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించకుండా.. కాలేజీ బోధనా విధానం, అధ్యాపక బృందం, విద్యార్థుల అభిప్రాయాలు, అకడమిక్ వాతావరణం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ర్యాంకుల కంటే విద్యార్థి సామర్థ్యాన్ని పెంచే నాణ్యమైన విద్యే దీర్ఘకాలంలో విజయానికి బలమైన పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి.

