IMD Rain Alert : బంగాళాఖాతంలో తుపాను..? ఈ ప్రాంతాల్లో కుండపోత వర్ష బీభత్సమేనా..?
Weather Update : బంగాళాఖాతంలో ఇవాళ ఓ అల్పపీడనం ఏర్పడనుంది... ఇంకో అల్పపీడనం కూడా సిద్దమవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో ఏ ఒక్కటి వాయుగుండంగా, తుపానుగా మారినా భారీ వర్షాలు తప్పవు.

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం
IMD Rain Alert : భూమధ్యరేఖకు సమీపంలో తూర్పు హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇది బలపడి తుపానుగా మారే అవకాశాలేమైనా ఉన్నాయా అని ప్రజలు కంగారుపడుతున్నారు. కానీ వాతావరణ శాఖ నుండి ఇప్పటికయితే అలాంటి సమాచారమేమీ లేదు.
భారీ వర్షాలు
బంగాళాఖాాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని.. తమిళనాడు తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్లోని ఒకటి రెండు చోట్ల వర్షాలు కురవొచ్చని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
అయితే ఫిబ్రవరి 19న బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అదికాస్త అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని... నెలాఖరులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండం, అదికాస్త తుపానుగా బలపడిందో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవు.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటోంది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయి... పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ. తమిళనాడు బార్డర్ లోని ఏపీ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

