లైగర్ కి డబుల్ బడ్జెట్ తో జనగణమన.. ప్రీరిలీజ్ ఈవెంట్ దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చిన పూరి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అటు పూరి జగన్నాధ్, ఇతి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఆగష్టు 25న రిలీజ్ అవుతోంది.
రిలీజ్ కి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లైగర్ చిత్ర యూనిట్ దేశం మొత్తం తిరిగి ప్రమోషన్స్ నిర్వహించారు. నేడు గుంటూరులో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకలో పూరి జగన్నాధ్ మాట్లాడారు. లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇద్దరూ పెర్ఫామెన్స్ ఇరగదీసినట్లు పేర్కొన్నారు. రమ్యకృష్ణ ఊరుకుంటుందా.. ఆమె కూడా ఉతికి ఆరేసింది.
ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం మైక్ టైసన్ ని తీసుకువచ్చాం. ప్రపంచంలో ఆయన్ని కొట్టే మొనగాడే లేడు అని పూరి జగన్నాధ్ అన్నారు. ముంబైలో ఒకరు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మైక్ టైసన్ అంటే ఎవరు అని అడిగారు. ఇంత కష్టపడి మైక్ టైసన్ ని తీసుకువస్తే.. వీళ్లేంటి ఇలా అడుగుతున్నారు అని అనుకున్నా. అందుకే సినిమా చూసే ముందు మైక్ టైసన్ అని గూగుల్ చేయండి అని పూరి తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన వాళ్లంతా ఒక్కో టికెట్ కొనుకున్నా మా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని పూరి అన్నారు. ఈ చిత్రాన్ని మేము ఎంతో ప్రేమతో తీశాం. కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు. కానీ లైగర్ కి డబుల్ బడ్జెట్ తో విజయ్ తోనే జనగణమన చేస్తున్నా. అది మా కాన్ఫిడెన్స్ అని పూరి జగన్నాధ్ అన్నారు.