సినిమా టికెట్ల ధరల మోతకు రంగం సిద్ధం
- సినిమా టికెట్ల పెంపుదలకు రంగం సిద్దం
- టికెట్ ధరలు పెంచుకునేందుకు హైకోర్టు సూచన
- మార్చి లోగా నివేదిక సిద్దం చేయాలని ఆదేశం
సినిమా టికెట్ల రేట్ల క్రమబద్దీకరణపై హైకోర్టు చేసిన తాజా సూచనలు ఏపీ, తెలంగాణాలలోని సినీ థియేటర్స్ లో టికెట్ల రేట్లు పెరిగేందుకు మార్గం సుగమం చేశాయి. చవగ్గా దొరికే సినీ వినోదం కూడా ఇక రాను రాను మరింత ప్రియం కానుంది. మనకు ఇప్పటిదాకా రూ.20, రూ.50,రూ. 70ల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మల్టీప్లెక్స్లోకి వెళ్తే మాత్రం టికెట్ ధర రూ.150 కి తగ్గదు. అయితే ఈ రేట్లు భవిష్యత్తులో మరింత పెరిగి వినోదం కోసం సినిమాలపై ఆధారపడే సామాన్యుడి నడ్డి విరగనుంది.
టికెట్ల రేట్లు క్రమబద్దీకరణపై హైకోర్టు తాజా సూచనలు రేట్ల పెరుగుదలకు మార్గం సుగమం చేసింది. ఏపీ, తెలంగాణాలలోని సినీ థియేటర్స్ లో టికెట్ల రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రేట్లను నిర్ణయించేందుకు ముఖ్య కార్యదర్శులు, హోం శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఈ రెండు రాష్ట్రాలప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసినపిటిషన్లను న్యాయమూర్తి రాజా ఎళంగో పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశించారు.
ఆ తీర్పు సంక్రాంతికి విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలకు వర్తించకపోవచ్చు. కానీ.. ప్రేక్షకుడిని మాత్రం నిరుత్సాహ పరిచేలా ఉంది. సత్వరమే పెంచాలని హైకోర్టు ఆదేశించినా.. టికెట్ రేట్లు ఎంత పెంచాలన్న దానిపై హోం శాఖ కార్యదర్శులు కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయించాల్సి ఉంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని మార్చి 31లోగా కమిటీ కొత్త రేట్లను నిర్ణయించాల్సి ఉంది. తర్వాత వెనువెంటనే థియేటర్లు రేట్లను పెంచేయొచ్చు.
ఇది ఓ విధంగా నిర్మాతలకు లాభసాటి వ్యవహారమే. రేట్ల సంగతి సరే, థియేటర్లో కనీస సౌకర్యాల మాటేంటి? దాదాపు 80 శాతం థియేటర్లలో టాయిలెట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రతీ థియేటర్లో మంచి నీటి సౌకర్యం కప్పించాలని కోర్టులు ఆదేశిస్తున్నా.. దాన్ని పట్టించుకొన్న పాపాన పోవట్లేదు. సౌకర్యవంతమైన సీట్లు కల్పించడంలో అశ్రద్ద చూపిస్తున్నారు. పేరుకే ఏసీ హాళ్లు.. కానీ చాలా థియేటర్లలో అవి పనిచేయవు. ముందు థియేటర్లలో మౌళిక సదుపాయాలు మెరుగు పరచి, ఆ తరవాత రేట్లు గురించి మాట్లాడితే మంచిది.