సెకండాఫ్లో వోల్వో ‘హైబ్రిడ్’ కారు.. అదీ మేకిన్ ఇండియా ప్రొడక్ట్
స్వీడన్ లగ్జరీ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోల్వో’ కారు భారతదేశంలో విద్యుత్ ఆధారిత ‘హైబ్రీడ్’కారును ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. మేకిన్ ఇండియా నినాదం మేరకు బెంగళూరులోని సంస్థ యూనిట్లో రూపొందించిన ప్లగ్ ఇన్ హైబ్రీడ్, బ్యాటరీతో తయారు చేశామని అన్నారు.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్యాటరీతో నడిచే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారును విడుదల చేయనున్నట్లు స్వీడన్ లగ్జరీ ఆటోమొబైల్ మేజర్ వోల్వో ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా ఈ బ్యాటరీని బెంగళూరులోని తమ ప్లాంట్లో రూపొందించనున్నట్లు చెప్పారు.
ఎక్స్సీ 90 మోడల్లో ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ను ప్రవేశపెట్టనున్నట్లు వోల్వో ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ చెప్పారు. అంతేకాదు, భారత్లో వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా గ్రామీణ మార్కెట్పై దృష్టి సారించామని ఫ్రంప్ తెలిపారు.
గత జనవరిలోనే విద్యుత్ వాహనాల్లో వాడే ఉపకరణాలు.. విదేశాల నుంచి వాటి దిగుమతిపై సుంకాన్ని 15 నుంచి 10 శాతానికి తగ్గించి వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంతో వోల్వో ఇండియా సంస్థ భారతదేశంలోని బ్యాటరీతో నడిచే విద్యుత్ కార్లను తేవాలని నిర్ణయించింది.
భారతదేశంలో విద్యుత్ వాహనం తయారు చేస్తున్న సంస్థ తమదేనని చార్లెస్ ఫ్రంప్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్థానికంగా కార్లను తయారు చేయడంతోపాటు ఇక్కడ కార్ల అసెంబ్లింగ్ కోసం 2017 అక్టోబర్ నెలలో బెంగళూరులో వోల్వో ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించినట్లు చార్లెస్ ఫ్రంప్ తెలిపారు.
ప్రస్తుతం 60 శాతం తమ వాహనాలు బెంగళూరులోనే అసెంబ్లింగ్ అవుతున్నయన్నారు. ప్రస్తుతం ఎక్స్ 90, ఎక్స్ సీ 60 వాహనాలను తయారు చేస్తున్నామని వోల్వో ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ చెప్పారు. ద్వితీయ, త్రుతీయ శ్రేణి మార్కెట్లపై తమ సంస్థ కేంద్రీకరించిందని వోల్వో ఎండీ చార్లెస్ ఫ్రంప్ తెలిపారు.
ఇటీవల ఇండోర్, రాయ్ పూర్ల్లో డీలర్లను ప్రారంభించామన్నారు. కాలికట్ నగరంలో షోరూమ్ ప్రారంభించామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల పరిధిలోనూ మంచి ప్రాతినిధ్యం ఉన్నదన్నారు. నోయిడాలో షోరూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. ప్రస్తుతం 25 ఔట్ లెట్లను కలిగి ఉన్నామని, ఈ ఏడాది రెండు లేదా మూడు డీలర్ షిప్లను ఏర్పాటు చేయాలని వోల్వో భావిస్తోంది.