Asianet News TeluguAsianet News Telugu

బీఎస్-6 వచ్చినా డీజిల్ కార్లకు ‘నో’ఢోకా: హోండా

వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ సంస్థలకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీపై కేంద్రీకరించాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ ప్రమాణాలతో డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చుతో కూడిన పని అని, ఆ మోడల్ కార్ల తయారీకే తిలోదకాలిచ్చేస్తున్నాయి. కానీ జపాన్ కేంద్రంగా పని చేస్తున్న హోండా కార్స్ మాత్రం డీజిల్ కార్ల విక్రయాలు సాగిస్తామని చెబుతోంది. ఇప్పటికిప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గబోదని పేర్కొంటున్నది. 
 

Honda to continue selling diesel models in India
Author
Mumbai, First Published May 13, 2019, 11:13 AM IST

ముంబై: వచ్చే ఏడాది నుంచి కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం బీఎస్ -6 ప్రమాణాలు గల వాహనాలను మాత్రమే తయారు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటితో టాటామోటార్స్, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు చిన్నకార్లలో డీజిల్‌ ఇంజిన్లకు దూరం అవుతున్నాయి.

బీఎస్ - 6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్లను తీర్చిదిద్దాలంటే కంపెనీలకు తడిసిమోపెడవుతుంది. ఆ భారం వినియోగదారులపై వేయడానికి టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి సంస్థలకు డీజిల్‌ ఇంజిన్ల తయారీ ఖరీదైన వ్యవహారంగా మారిపోనుంది. 

దీంతో  చాలా కంపెనీలు డీజిల్‌ ఇంజిన్లు తయారు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరో పక్క జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మాత్రం బీఎస్‌-6 కఠిన నిబంధనలను ఎదుర్కొనేలా డీజిల్‌ ఇంజిన్లను అప్‌గ్రేడ్‌ చేయనుంది. ప్రస్తుతం  హోండా రెండు రకాల డీజిల్‌ ఇంజిన్లను వినియోగిస్తోంది. 

అమేజ్‌, సిటీ, డబ్ల్యూ-వీ, బీఆర్‌-వీ, సివిక్‌, సీఆర్‌-వీ వంటి మోడళ్లలో బీఎస్ - 6 ప్రమాణాలతో తయారుచేసిన ఇంజిన్లను వాడుతోంది. ఈ ఏడాది చివరి నుంచే హోండా తన పెట్రోల్‌, డీజిల్‌ మోడళ్లలో సరికొత్త బీఎస్-6 ఇంజిన్లను అమర్చనుంది.

‘మా కస్టమర్లలో చాలా మంది డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్ల ఎంపికలో చాలా స్పష్టంగా ఉంటారు. వారు రోజువారీగా తిరిగే దూరం, వారికి పెట్టుబడిపై రాబడి మొత్తం అంచనా వేసుకొని ఇంజిన్లను నిర్ణయిస్తారు. కేవలం 20 శాతం మందే భావోద్వేగాలతో నిర్ణయించుకొంటారు’అని హీరో కార్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోయల్‌ తెలిపారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రాగానే పెట్రోల్‌, డీజిల్‌ మోడళ్ల మధ్య ధరల్లో వ్యత్యాసం కూడా భారీగా పెరిగిపోతుందని గోయల్‌ అభిప్రాయపడ్డారు. డీజిల్‌ కార్లు ఇప్పట్లో అదృశ్యమయ్యే పరిస్థితి లేదని తెలిపారు. మార్కెట్‌ డిమాండ్‌కు తగినట్లు తాము డీజిల్‌ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. 

ఇటీవలే విపణిలోకి విడుదల చేసిన సివిక్, సీఆర్ - వీ మోడల్ కార్లలో బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్లనే అమర్చామని రాజేశ్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచే బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios