కాలేజీలే అడ్డాగా గంజాయి విక్రయం: ఆరుగురు విద్యార్థుల అరెస్ట్
విజయవాడలోని పలు కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అరకు నుండి నేరుగా విజయవాడకు తీసుకొచ్చి విద్యార్థులు విక్రయిస్తున్నారు.
విజయవాడ: విజయవాడలోని పలు కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అరకు నుండి నేరుగా విజయవాడకు తీసుకొచ్చి విద్యార్థులు విక్రయిస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్నవారిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. తాము కాలేజీకి తీసుకెళ్లే బ్యాగులోనే గంజాయిని తీసుకెళ్లి సహచర విద్యార్థులకు విక్రయిస్తున్నారు.
విజయవాడలోని గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురంలలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఆరుగురు విద్యార్థులు విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. అరెస్టైన ఆరుగురు విద్యార్థులు అరకులో ఎవరి వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు.
అరకు నుండి నాలుగు లేదా ఐదుకిలోల గంజాయిని తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్నారు. కాలేజీల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రూ. 400 నుండి రూ. 500లకు విక్రయిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.