Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి పార్టీని అమ్ముకున్నాడు, పవన్ ప్రజలను నమ్ముకున్నాడు, అన్నదమ్ముల మధ్య తేడా ఇదే : ఎడిటర్స్ కామెంట్

అన్న చిరంజీవికి సాధ్యంకానిది తమ్ముడు పవన్ కల్యాణ్ చేసి చూపించారు. అన్న పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాడని అనేవాళ్ల నోర్లు మూయించి వారితోనే అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నారు పవన్ కల్యాణ్. అన్న పార్టీని అమ్ముకుని తిరిగి సినిమాలదారి పడితే తమ్ముడు మాత్రం ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోనూ సక్సెస్ సాధించారు.  

The Stark Contrast Between the Mega brothers Chiranjeevi and Pawan kalyan AKP
Author
First Published Jun 13, 2024, 2:51 PM IST

తమిళనాడులో ఎంజీఆర్ మొదలుకొని విజయ్ వరకూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మొదలుకుని పవన్ కల్యాణ్ వరకూ చూస్తే.. దక్షిణాదిలో సినిమాలు, రాజకీయాలు సమ్మిళితంగా కనిపిస్తాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటులు, రచయితలు రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు, తమిళ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులూ అయ్యారు. ఈ రెండు రాష్ట్రాలనూ ఓ సారి పరిశీలిస్తే.. ఎక్కడ పొలిటికల్ వేకన్సీ వచ్చినా దాన్ని ఆక్యుపై చేసేది మాత్రం సినీ రంగం వాళ్లే. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత రాజకీయ రంగంలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి పీఠాలు దక్కించుకోగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఎన్టీ రామారావుకే అది సాధ్యమైంది. కృష్ణ, దాసరి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బాబు మోహన్‌, మురళీ మోహన్‌ వంటి వారు రాజకీయాల్లోకి వెళ్లారు. పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్‌లా రాజకీయాలను శాషించలేదు.   తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేకపోయారు. కానీ దీనికి భిన్నంగా చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం సక్సెస్ సాధించారు. మరి అన్నకు సాధ్యం కానిది.. పవన్ కల్యాణ్‌కు ఎలా సాధ్యమైంది. 

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లలోనే పార్టీని క్లోజ్‌ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి కాగలిగాడు... కానీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ లా సక్సెస్‌ మాత్రం కాలేకపోయాడు. పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను శాషిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. ప్రభుత్వంలోనూ కింగ్ మేకర్ అయ్యాడు.

చిరంజీవిది పర్‌ఫెక్ట్ స్టార్ట్ కానీ.. పవర్ మిస్సయింది!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ వంటి హేమాహేమీలున్న తరుణంలో.. అంటే 2000 సంవత్సరం నుంచీ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి.. ముఖ్యమంత్రి అవ్వాలన్న కాంక్ష ఓ వర్గం నుంచి వినిపించింది. కానీ చిరంజీవి ఆవేశంతో కాకుండా ఆచి తూచి 2008 వరకు వేచి పక్కా ప్రణాళికతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆగస్ట్ 2న భారీ స్థాయిలో ఈవెంట్‌ ఏర్పాటు చేసి పార్టీ పేరుని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్‌కి సినిమా పరంగా భారీ క్రేజ్‌ ఉంది. అత్యంత మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. దీంతో జనం కుప్పులు తెప్పలుగా వచ్చారు. ఆయన మీటింగ్‌ పెడితే లక్షల్లో జనాలు వచ్చారు. ఒక సునామీలా ఆయన మీటింగ్‌లు ఉండేవి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకుగానూ కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి ఎన్నికలకు ఆరు నెలల ముందే మాత్రమే పార్టీని స్థాపించాడు. ఆ ఆరు నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. 

నిజానికి 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాప్‌ లేదు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అంతేకాదు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఉన్నాడు. టీడీపీ గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్‌ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీలకు గ్రౌండ్‌ లెవల్‌లో బలమైన పునాదులున్నాయి. దీనికితోడు తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ మూడు పార్టీలు ఉన్నంతలో బలంగా ఉన్నాయి. రాజకీయపరమైన గ్యాప్‌ ఏమాత్రం లేదు. అలాంటి సమయంలో మెగాస్టార్‌ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తెలంగాణ సెంటిమెంట్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. తెలంగాణలో కేవలం ఒకే సీట్‌ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే మిగిలిన 17 సీట్లు వచ్చాయి. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక్క చోటే(తిరుపతి) విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్‌ ఇచ్చాయి. 

అధికారం ఫామ్‌ చేయాలనే టార్గెట్‌తో, ఎన్టీఆర్‌లా తాను కూడా ఓ సునామీలో రాజకీయ ప్రత్యామ్నాయంగా రావాలని భావించి పీఆర్‌పీని స్థాపించిన చిరుకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌ ఇచ్చాయి. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్‌, మాస్‌ ఫాలోయింగ్‌ కేవలం సినిమాకే పరిమితమని, అవి ఓట్లుగా టర్న్ కాలేదని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. అభిమానం వేరు, పార్టీ వేరు అని చాటి చెప్పాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లోకి వెళ్లడం, గ్రౌండ్‌ లెవల్‌ల్లోకి వెళ్లలేకపోవడం వంటివి పెద్ద ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోగా ఆడియెన్స్ మనసుని దోచుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జనం మనసుని గెలవలేకపోయాడు. 

రాజశేఖర రెడ్డికి పెద్ద ప్లస్ అయింది..

వాస్తవానికి చిరంజీవి పార్టీ పెట్టడం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ వర్సెస్ తెలుగు దేశంగా ఉన్న పోటీ ప్రజారాజ్యం పార్టీ రాకతో ట్రయాంగిల్ పోరుగా మారిపోయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రావడంతో అది రాజశేఖర్ రెడ్డికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ వరుసగా రెండో సారి గెలిచి రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే ఇవ్వాలి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ లేకపోయి ఉన్నా.. లేక తెలుగు దేశం, ప్రజారాజ్యం కలిసి ఎన్నికలకు వెళ్లున్నా పరిస్థితి వేరుగా ఉండేది. కానీ చిరంజీవిలో తాను సీఎం అయిపోవాలన్న బలమైన కాంక్ష రాజశేఖరరెడ్డకి వరమైంది. తర్వాత పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ మాత్రం ఈ తప్పు చేయకుండా తెలుగు దేశంతో కలిసి వెళ్లి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకకుండా జాగ్రత్తపడ్డాడు. అది పవన్ కి పెద్ద విజయంగా మారింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా సరిగ్గా జరగలేదన్న వాదనా ఉంది. అల్లు అరవింద్ జోక్యంతో డబ్బులకు అధిక ప్రయారిటీ ఇచ్చి.. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని.. అందువల్లే చిరంజీవి పార్టీ గెలవలేకపోయిందన్న ప్రచారమూ బాగానే జరిగింది. 

The Stark Contrast Between the Mega brothers Chiranjeevi and Pawan kalyan AKP

సెన్సిటివ్ మైండ్ సెట్

చిరంజీవి.. 2009 ఎన్నికల అనంతరం కేవలం రెండేళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో తన పీఆర్‌పీని విలీనం చేశాడు. తాను కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్య్ర హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా ఆ రెండేళ్లు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యాడు. చిరు.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడలేకపోయాడు, తనపై వచ్చే విమర్శలను తీసుకోలేకపోయాడు, అధికార పక్షాన్ని విమర్శించలేకపోయాడు. తన సెన్సిటివ్‌ మైండ్‌ సెట్‌ ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. తాను ఈ రాజకీయాలకు పనికి రానని, ఈ రాజకీయ బురద తాను చల్లుకోలేనని భావించి పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, మంత్రి పదవి తీసుకుని రిలాక్స్ అయ్యాడు.  ఐదేళ్లలోనే రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. నిజానికి చిరంజీవి ఆ తక్కువ సమయంలోనే పార్టీ పెట్టి, ఎన్నికల్లోకి వెళ్లి 18 సీట్లు గెలవడం గొప్ప విషయమే అని అనుకోవచ్చు. కానీ అది పెద్ద పరాజయంగానే చెప్పాలి. ఎందుకంటే అప్పడున్న వేవ్ కు ఆ ఫలితాలు చాలా తక్కువ. 

అన్న చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్న పవన్ కల్యాణ్.. దీర్ఘ కాలిక ప్రణాళికతో రాజకీయ రంగంలోకి దిగాడు. పదవులు, డబ్బులు కాకుండా మొదట జనాల్లోకి వెళ్లాలన్న ప్రణాళికతో 2014 మార్చి 14న పవన్‌ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. ఆ టైమ్‌లో కూటమినే విభజిత ఆంధప్రదేశ్‌లో విజయం సాధించింది. 

కొన్నాళ్ల తర్వాత పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అటు సినిమాలు చేస్తూనే, రాజకీయాలకు టైమ్‌ ఇచ్చాడు. జనం మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించాడు, వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమయ్యాడు. రెగ్యూలర్‌గా జనంలోకి వెళ్తూ నెమ్మదిగా ఎదగాలని భావించారు.  కానీ ప్రారంభంలో పవన్‌కి కూడా అన్నలాగే తమ్ముడు కూడా వచ్చి వెళ్లిపోతాడు, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరనే విమర్శలు వచ్చాయి. అధికార పక్షం, అటు ప్రతిపక్షం వైసీపీ కూడా విమర్శలు చేసింది. వ్యక్తిగత జీవితాన్ని లాగి విమర్శలు చేశారు. ఇవన్నింటిని భరించాడు పవన్‌. తిట్టుకి తిట్టే సమాధానం అని భావించి రెచ్చిపోయాడు, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. 

ఈ క్రమంలో ఆయన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా, ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఘోరంగా పరాజయం చెందింది. అయినా పవన్‌ తగ్గలేదు. తాను లాంగ్‌ టర్మ్ రాజకీయాలను చూస్తున్నానని వెల్లడించాడు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్‌ లెవల్‌లో క్యాడర్‌ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఐదేళ్లలో ఆ పని చేశాడు. చాపకింద నీరులా నెమ్మదిగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాడు పవన్‌. తరచూ జనంలో ఉన్నాడు. మీటింగ్ లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాడు, ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్‌ పెంచాడు, వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్‌ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా పారిపోయే వాడు కాదు, ఉండేవాడని జనం నమ్మేలా చేశాయి. 

ఇప్పుడు పవన్‌ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఓట్ల మేనేజ్‌మెంట్‌ తెలుసుకున్నాడు. ఏ అంశాన్ని మాట్లాడితే ఎవరిని టార్గెట్‌ చేయోచ్చు, ఏ జనాన్ని ఆకర్షించించో తెలుసుకున్నాడు. తమ అతిపెద్ద సామాజిక వర్గం అయిన కాపుని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. తాను రాజకీయాల్లో ఉంటానని, వారికి అండగా ఉంటానని నమ్మకం కలిగేలా చేశాడు. దీంతో ఆ వర్గం పవన్‌ వైపు మళ్లింది. వైసీపీ వైపు ఉన్న వాళ్లంతా పవన్‌ వైపు టర్న్ తీసుకున్నారు. మరోవైపు యూత్‌ని టార్గెట్‌ చేస్తూ వెళ్లాడు పవన్‌. వారిని బాగా రెచ్చగొట్టాడు. పైసలకు అమ్ముడు పోయే వారు కాదు యువత అంటే అంటూ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు, తనవైపు ఆకర్షింప చేసుకున్నాడు. పవర్‌ పుల్‌ స్పీచ్‌లతో యువతని బాగా ఆకర్షించాడు. ఇవన్నీ పవన్‌కి 2024 ఎన్నికలలో పనిచేశాయి. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో 82 శాతం పోలింగ్ నమోదైందంటే కారణం పవన్ కల్యాన్. అందుకే ఏపీలో 2024 ఎన్నికల్లో పవన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.

The Stark Contrast Between the Mega brothers Chiranjeevi and Pawan kalyan AKP

స్మార్ట్ మూవ్ 

ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించిన పవన్‌.. రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్‌ చేశాడు. తనే ముందుండి ఈ ప్రక్రియని నడిపించాడు. అన్నీ తానై వ్యవహరించాడు. మూడు పార్టీలు కలిసి పనిచేసేలా ప్లాన్‌ చేసి ఎన్నికల్లోకి వెళ్లాడు. తమ కార్యకర్తల్లోనూ ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసని ఇచ్చాడు పవన్‌. ఎన్నికలకు ముందు నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. ఎన్నికల్లోనూ అగ్రెసివ్‌గా ప్రచారం నిర్వహించాడు. మాటకు తూటా పేలుస్తూ ముందుకెళ్లాడు. అత్యంత పవర్‌ఫుల్‌ స్పీచెస్‌తో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నాడు పవన్‌. ఆయన స్పీచ్‌లు బాగా హైలైట్‌ అయ్యాయి. జనాన్ని, యువతని బాగా ఆకర్షించాయి. అవన్నీ ఓట్లుగా మారాయి. 

వైసీపీ ఓట్లలో చీలిక

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది. ఉపాధి కల్పించే విషయంలో, రాష్ట్ర అభివృద్ధి, రోడ్డ విషయంలో విఫలం అయ్యాడు జగన్‌. లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, భూహక్కు చట్టాల్లో మార్పులు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. మరోవైపు రాజధాని అంశం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఇలా జగన్‌ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు పవన్‌. ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు చేసి సక్సెస్‌ అయ్యాడు. వైసీపీ ఓట్లలోనూ చీలిక తీసుకొచ్చాడు. దాదాపు తొమ్మిదిశాతం ఓట్లు జనసేన సాధించిందంటే అందులో సగం వైసీపీ ఓట్లే. అంతేకాదు తాను పోటీ చేసిన అన్ని సీట్లలో(21అసెంబ్లీ, 2 ఎంపీ) విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పాడు. ఓ కింగ్‌ మేకర్ గా నిలిచారు. సీట్ల ప్రకారం టీడీపీ సక్సెస్‌ అయినా, నైతికంగా, రాజకీయంగా పవన్‌ ఎక్కువ సక్సెస్‌ అయ్యాడు. ఆయన దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు.  అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయవంతంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకోబోతున్నారు పవన్‌. 

అన్న చిరంజీవిలా ఇలా పార్టీ పెట్టిన రెండు మూడు సంవత్సరాల్లోనే పార్టీని క్లోజ్‌ చేయకుండా పదేళ్లు వెయిట్‌ చేశాడు పవన్‌. బాగా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, తాను తిట్టాడు, ఫక్తు రాజకీయ నాయకుడిలా మారాడు, విజయం సాధించాడు. కానీ చిరంజీవి అలా చేయలేకపోయాడు. ఆయన మనస్థత్వం ఆయన్ని త్వరగా పార్టీ క్లోజ్‌ చేసేలా చేసింది. చిరంజీవిలోని సెన్సిటివ్‌ నేచర్‌ ఆయన్ని రాజకీయాల్లో  అట్టర్‌ ఫ్లప్‌ చేస్తే, అదే డేరింగ్‌, డైనమిక్‌ ఆలోచనలు, మొండితనం పవన్‌ని సూపర్‌ హిట్‌ చేశాయి.
మొన్న చంద్రబాబు పదవీ ప్రమాణ వేదిక మీది జరిగిన సీట్లు కొన్ని పరిశీలిస్తే.. అటు చంద్రబాబు నుంచి గానీ.. ఇటు ప్రధాన మంత్రి మోదీ నుంచి కానీ పవన్‌కు ఎంత సపోర్ట్ ఉన్నదో అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. కేంద్రంలోని బీజేపీ చంద్రబాబుకన్నా పవన్ కల్యాణ్ కు ఎక్కువ ప్రారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ చంద్రబాబు, జగన్ కన్నా పవన్ కల్యాణ్ ను ఎక్కువగా విశ్వసిస్తోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మరింత పైకి ఎదిగే అవకాశాలు పుష్కలం. మరో దశాబ్దకాలంలో అంటే వచ్చే రెండు ఎన్నికల్లో ఓటు బ్యాంకును, సీట్ల సంఖ్యను పెంచుకోగలిగితే పవన్ కల్యాణ్ వైసీపీ,  టీడీపీ  ఇద్దరికీ మేకులా తయారై.. అధికారం చేపట్టినా చేపట్టవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios