అప్రతిష్టపాలు చేసేందుకే తప్పుడు ప్రచారం: టీడీపీ ఎంపీలు
టీడీపీ ఎంపీలకు తలనొప్పిగా మారిన సరదా సంభాషణ
అమరావతి: తమను ఉద్దేశపూర్వకంగానే అన్పాపులర్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్ దీక్షపై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు.దీంతో ఎంపీలు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎంపీలు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.తమ మాటలు వైరల్ కావడం బాధ కల్గించిందని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.తమను అన్పాపులర్ చేయడానికే కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీజేపీ, జనసేన, వైసీపీ ఈ తరహ తప్పుడు ప్రచారం చేస్తారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని వారు చెప్పారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము నిరంతరం పోరాటం చేస్తున్న విషయాన్ని ఎంపీలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ నివాసంలో తాము చిట్ చేసిన అంశాలను ఉద్దేశపూర్వకంగా కొందరు మీడియాకు విడుదల చేశారని ఎంపీలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ వీడియోను తమకు అనుకూలంగా ఎడిటింగ్ చేశారని కూడ ఎంపీలు ఆరోపించారు.