సోన్ రేప్ కేసుపై పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదీ...
తెలంగాణలోని నిర్మల్ జిల్లా సోన్ అత్యాచార ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణలోని నిర్మల్ జిల్లా సోన్ అత్యాచార ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అన్నెంపున్నెం ఎరుగని బాలికలపై, యువతులపై అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలను బహిరంగంగా శిక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్మల్ జిల్లా సోన్ లో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై 30 ఏల్ల వ్యక్తి అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశాడనే విషయం తెలియగానే హృదయం ద్రవించి పోయిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కాశ్మీర్ లోని కథువా, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతాల్లో బాలికలపై చోటు చేసుకున్న అత్యాచార ఘటనల చేదు జ్ఞాపకాలు సమాజంలో పచ్చిగానే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు సోన్ లో చోటు చేసుకున్న దురాగతం గురించి వినడం బాధ కలిగించిందని అన్నారు.
ఫోక్సో చట్టం అమలులో లోపాలు లేకుండా చూడడంతో పాటు అడబిడ్డల జోలికి వస్తే కఠినంగా శిక్షించేలా చట్టంలో సవరణలు చేయాలని ఆయన కోరారు. బహిరంగంగా శిక్షిస్తేనే పశువాంఛ కలిగినవారిలో భయం పడుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దోషిని కఠినంగా శిక్షించి బాధిత బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.