ఎట్టకేలకు స్కూల్ యజమాని అరెస్టు: నిద్ర లేచిన విద్యా శాఖ
న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్ భవనం కూలి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటనలో స్కూల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఆయనను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
హైదరాబాద్: న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్ భవనం కూలి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటనలో స్కూల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఆయనను శనివారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, అరెస్టును పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
పోలీసులు అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. నష్టపరిహారంపై సంప్రదింపులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న స్కూల్ యజమాని వెంకటేశ్వర రావు పరారయ్యాడు. గురువారం రాత్రి స్కూల్ కోఆర్డినేటర్ వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేశారు
వెంకటేశ్వర రావు భవనాన్ని పదేళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితమే లీజు అగ్రిమెంట్ పూర్తయింది. ఏడాదిగా ఆయన భవనం యజమాని దామోదర్ కు అద్దె కూడా చెల్లించడం లేదని పోలీసులు అంటున్నారు. స్కూల్ యజమానిని త్వరలోనే అరెస్టు చేస్తామని కూడా అంటున్నారు.
స్కూల్ భవనం కూలిన ఘటనకు సంబంధించి ఎట్టకేలకు విద్యాశాఖ నిద్ర లేచింది. మడల విద్యాధికారి (ఎంఈఓ)ను సస్పెండ్ చేసింది. ప్రమాదంలో మణికీర్తన, చందన అనే ఇద్దరు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.
ఎంఈఓ బి. శ్రీధర్ ను విద్యాశాఖాధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మేడ్చెల్ జిల్లా విద్యాధికారి విజయకుమారికి మెమో జారీ చేశారు .న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్ లో తనిఖీలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తూ ఆ మెమో జారీ ఏయింది.
న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చించే విషయంపై విజయకుమారి శుక్రవారం సమావేశం పాఠశాల ప్రతినిధులతో ఏర్పాటు చేసి చర్చలు జరిపారు.