న్యూ ఇయర్ సెలబ్రేషన్సే టార్గెట్.. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, శంషాబాద్లో గుట్టురట్టు
పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్లో డ్రగ్స్ దందా యథేచ్చగా సాగుతోంది. తాజాగా న్యూఇయర్ వేడుకల్ని లక్ష్యంగా చేసుకుని భారీ డ్రగ్స్ విక్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
శంషాబాద్లో డ్రగ్స్ను పట్టుకున్నారు పోలీసులు . ముంబై నుంచి హెరాయిన్ తీసుకొస్తున్న అబ్ధుల్ ఖాద్రీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ టార్గెట్గా ముంబైలో డ్రగ్స్ తీసుకుని అతను హైదరాబాద్ వచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఖాద్రీ వద్ద నుంచి 50 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
ఇదిలావుండగా... హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్తో కలిసి నార్త్జోన్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఈ ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలో వీరు ఎక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు.
Also REad: ముదిరిపోయిన స్మగ్లర్లు , ఏకంగా చాక్లెట్ల రూపంలో గంజాయి... పోలీసుల దాడుల్లో వెలుగులోకి
ఇకపోతే.. చాక్లెట్ల రూపంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను మెదక్, ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ సమీపంలోని చర్లపల్లి బస్టాప్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ పాన్ షాపులో 3,286 గంజాయి చాక్లెట్లు దొరికాయి. ఒడిషా నుంచి వీటిని తెచ్చి యువత, విద్యార్ధులు, కార్మికులకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మరో ఘటనలో మెదక్ జిల్లా శివ్వంపేటలో సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కంపెనీల్లో పనిచేసే కార్మికులు, విద్యార్ధులే లక్ష్యంగా ఈ ముఠా దందా సాగిస్తున్నట్లుగా వెల్లడించారు.