ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) అక్రమాలపై నాటి ఆరోపణలు ఇప్పుడొక కీలక దశను దాటాయి. 2009లో ఈ కేసుపై ప్రారంభమైన విచారణకు 15 ఏళ్ల అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగు ప్రధాన నిందితులకు శిక్ష విధించగా, ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. ఈ తీర్పు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. ఆయనతో పాటు, ఓఎంసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీవీ శ్రీనివాసరెడ్డి, ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వీడీ రాజగోపాల్, మాజీ గనుల సంచాలకుడు కె. మెఫజ్ అలీఖాన్‌లను కూడా కోర్టు దోషులుగా గుర్తించింది. వీరిపై అక్రమ మైనింగ్‌కు అనుమతులు కల్పించడం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, అవినీతి చర్యలపై ఆరోపణలు ఉండగా, కోర్టు విచారణలో అవి న్యాయంగా నిరూపితమయ్యాయి. వీరికి ఏడేళ్లు జైలు శిక్ష‌తో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ మాజీ కార్యదర్శి కృపానందం లను సీబీఐ కోర్టు పూర్తిగా నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. వీరిద్దరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ, సమగ్ర విచారణలో వారికి సంబంధం లేదని తేలింది.

కేసు నేపథ్యం ఇదీ..

2009లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ చర్యలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. అనంతరం 2011లో తొలి ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఛార్జిషీట్‌లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, కృపానందం పేర్లు ఉన్నాయి. మొత్తం నాలుగు ఛార్జిషీట్లలో తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు.

2022లో, కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కోర్టు విచారణ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఆమెపై చట్టపరంగా ఆరోపణలు నిలబడలేదని కోర్టు తేల్చింది.