Asianet News TeluguAsianet News Telugu

హిటాచీ సిగలో ఏబీబీ ‘పవర్‌’

జపాన్ ఇంజినీరింగ్ దిగ్గజం హిటాచీ.. స్విస్ ఇంజినీరింగ్ మేజర్ ఏబీబీ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ వ్యాపారాన్ని చేజిక్కించుకోనున్నది. ఈ విషయమై రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. డీల్ విలువ 6.4 బిలియన్ల డాలర్లు.. అన్ని సక్రమంగా సాగితే 2020 ప్రథమార్థంలో డీల్ పూర్తిగా అమలులోకి వస్తుంది.

Hitachi to announce purchase of ABB's power grid business
Author
Delhi, First Published Dec 18, 2018, 9:45 AM IST

స్విస్‌ ఇంజనీరింగ్‌ మేజర్ ఏబీబీ ఆధ్వర్యంలోని పవర్‌ గ్రిడ్స్‌ వ్యాపార విభాగాన్ని జపాన్‌ సంస్థ హిటాచీ కైవసం చేసుకోనున్నది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్‌ గ్రిడ్స్‌ వ్యాపార పరిమాణం 11 బిలియన్‌ డాలర్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.79,200 కోట్లు) అని తెలుస్తోంది.

అంటే ఏబీబీ- హిటాచీ మధ్య కుదిరిన డీల్‌ విలువ సుమారు 6.4 బిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తయితే 2020 ప్రథమార్ధంలో ఏబీబీ పవర్ గ్రిడ్ బిజినెస్.. పూర్తిగా హిటాచీ కంట్రోల్‌లోకి రావచ్చునని అంచనా.

డీల్‌ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్‌ వెంచర్‌లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్‌ రేటుకు విక్రయించి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్‌ గ్రిడ్‌ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ ఒప్పందం ఎంతో మేలు చేయనున్నదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.  

మరోవైపు పారిశ్రామిక రోబోల తయారీ ప్రధానంగా ఎంచుకున్న ఏబీబీ... ఆటోమేషన్‌ వంటి విభాగాలపై దృష్టి పెట్టేందుకు అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్‌ తోడ్పడనుంది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్‌ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్‌ డాలర్ల మేర వ్యయం తగ్గుతుందని ఏబీబీ  వివరించింది.

జాయింట్‌ వెంచర్‌ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్‌ గ్రిడ్‌ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1% వాటాలను సుమారు 6.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది.  

ఏబీబీకి చెందిన పవర్‌ గ్రిడ్‌ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్‌ సరఫరా పరికరాలు, కంట్రోల్‌ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇందులో 36,000 మందిపైగా సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్‌ స్వల్పంగా 60 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. 

రెండేళ్ల క్రితమే పవర్‌ గ్రిడ్స్‌ విభాగాన్ని విక్రయించాలని కొందరు వాటాదారుల నుంచి డిమాండ్‌ వచ్చినా, ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పైస్‌హోఫర్‌ అంగీకరించలేదు.  తాజాగా యూటర్న్‌ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్‌ నేపథ్యంలో సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios