Asianet News TeluguAsianet News Telugu

మై బిగ్ మిస్టేక్: గూగుల్‌ ‘ఆండ్రాయిడ్‌’పై బిల్‌గేట్స్‌

సంస్థలో సాంకేతిక నిపుణులు ఉన్నా.. సరైన నిపుణులను నియమించలేక.. సుదీర్ఘ కాలంగా యాంటీ ట్రస్ట్ విచారణ జరిగిన ఫలితంగా మొబైల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వ్యవస్థపై పట్టు సాధించలేకపోయామని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పారు. తన కెరీర్‌లో ఇదే అతిపెద్ద పొరపాటని అభివర్ణించారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ సేవలంటేనే గూగుల్ అన్నంతగా అందరికీ సెర్చింజన్ గుర్తుండిపోయింది. కాకపోతే పర్సనల్ కంప్యూటర్స్ రంగంలో పట్టు కలిగి ఉన్నామని బిల్ గేట్స్ చెప్పారు.

Bill Gates reveals the 'biggest mistake' he made at Microsoft
Author
Washington D.C., First Published Jun 26, 2019, 10:39 AM IST

వాషింగ్టన్: యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఐఓఎస్‌కు ప్రధాన పోటీగా మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఆవిష్కరించలేకపోవడమే మైక్రోసాఫ్ట్‌ అధిపతిగా తన అతిపెద్ద తప్పిదమని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ అంగీకరించారు. ఇటీవల రెండు ఇంటర్వ్యూల్లోనూ, ఒక ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు బిల్ గేట్స్ ఈ సంగతిని ప్రస్తావించారు. 

ఐఓఎస్‌కు పోటీగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌కు మైక్రోసాఫ్ట్‌ ఎలా కోల్పోయిందీ వివరించారు. మొబైల్ టెక్నాలజీలో ఆధిపత్య స్థాయిలో ఉండే అవకాశాన్ని కోల్పోయామని, ఇందుకు సుదీర్ఘ కాలంగా సాగిన యాంటీ ట్రస్ట్ విచారణే కారణం అని చెప్పారు. 

‘సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలో ముఖ్యంగా ప్లాట్‌ఫామ్‌ (ఆపరేటింగ్‌ సిస్టమ్‌-ఓఎస్‌)ల వల్లే మార్కెట్లలో విజయవంతం అవుతాం. వ్యక్తిగత కంప్యూటర్లకు విండోస్‌ ఓఎస్‌తో విజయం సాధించాం. స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో ఇది సాధ్యం కాలేదు. ఐఓఎస్‌ కేవలం ఐఫోన్లకే పరిమితం. అందువల్ల ఇతర ఫోన్లకు వేరే ఓఎస్‌ అవకాశం కచ్చితంగా ఉంది. ఆండ్రాయిడ్‌ అలా స్థిరపడింది’ అని బిల్ గేట్స్ అన్నారు.

‘సెల్‌ఫోన్‌ అత్యంత జనాదరణ పొందుతుందని అంచనా వేసే, మొబైల్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ మొబైల్‌ను 2000లోనే ఆవిష్కరించింది. భవిష్యత్‌లో మొబైల్ ఫోన్లు చాలా ప్రజాదరణ పొందుతాయని ఆనాడే ఊహించాం. ఈ విభాగానికి సరైన వ్యక్తులను నియమించక పోవడం కూడా ఒక కారణమే’ బిల్ గేట్స్ చెప్పారు. 

ఆపిల్‌ తమ ఐఫోన్‌ను 2007లో ప్రవేశ పెట్టింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌ 2008లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ కంటే విండోస్‌ మొబైల్‌ బాగా వెనుకబడింది. ఇందుకు అప్పట్లో యాంటీట్రస్ట్‌ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో, మైక్రోసాఫ్ట్‌ తమ వద్ద అత్యుత్తమ నిపుణులు ఉన్నా కూడా, మొబైల్‌ కోసం కేటాయించలేకపోయిందని బిల్ గేట్స్ అన్నారు.

అందువల్లే మొబైల్‌లో ఏమైతే తప్పనిసరిగా సాధించాలని భావించామో, అది చేయలేకపోయామని బిల్ గేట్స్ చెప్పారు.. ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసిన గూగుల్‌కు, బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం లభిస్తోందని, 2017లో విండోస్‌ 10 ఫోన్లకు సహకారం విరమించుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. కంప్యూటర్ల రంగంలో మాత్రం విండోస్‌, ఆఫీస్‌తో పటిష్టంగా ఉన్నాం అని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. 

‘ప్రస్తుత సీఈఓ సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్‌ విలువ మరింత పెరుగుతోంది. రూ.70 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది’ అని బిల్ గేట్స్ ప్రశంసించారు. దశాబ్ధం క్రితమే మైక్రోసాఫ్ట్ రోజువారీ యాజమాన్య కార్యకలాపాల నిర్వహణ నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. 

తమ వద్ద నిపుణులు ఉన్నా.. ఆండ్రాయిడ్ సిస్టమ్‌పై పట్టు సాధించలేకపోయామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అడ్వైజర్ గా ఉన్న బిల్ గేట్స్.. తన టైంలో ఆరో వంతు మాత్రమే సంస్థ కోసం కేటాయిస్తున్నారు. మిగతా సమయం అంతా ఎనర్జీ వెంచర్ ఫండ్, కర్బన ఉద్గారాల నియంత్రణ, భూతాప నివారణ తదితర అంశాలపై కేంద్రీకరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios