ప్రో కబడ్డి 2019: యూ ముంబా సమిష్టి పోరాటం...పాట్నా పైరేట్స్ కు తప్పని ఓటమి
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూ ముంబా మరో విజయాన్ని అందుకుంది. పాట్నా ఫైరేట్స్ తో జరిగిన జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో చివరకు ముంబైనే విజయం వరించింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా ఫైరేట్స్ కు మరో ఓటమి తప్పలేదు. యూ ముంబా తో తలపడ్డ ఫైరేట్స్ చివరివరకు పోరాడినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అహ్మదాబాద్ వేదికన జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై రైడర్స్ అదరగొట్టారు. దీంతో ఈ సీజన్లో ఆ జట్టు మరో అద్భుత విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో ముందుడుగు వేసింది.
పాట్నా ఫైరేట్స్ అన్ని విషయాల్లోనూ ముంబైపై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది కానీ రైడర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యింది. ఇలా యూ ముంబై కేవలం రైడింగ్ లోనే 24 పాయింట్లు సాధించింది. ఓ సూపర్ రైడ్ ద్వారా మరో పాయింట్ ఇలా మొత్తంగా రైడర్లే 25 పాయింట్లు సాధించిపెట్టి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ట్యాకిల్స్ 7, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో మరోటి ఇలా మొత్తం 34 పాయిట్లు సాధించి విజయబావుటా ఎగరేసింది.
ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే రోహిత్ బలియాన్ 9, అతుల్ 8, సందీప్ నర్వాల్ 6 పాయింట్లతో అదరగొట్టారు. మిగతావారిలో అర్జున్ 4, ఫజల్ 3 పాయింట్లతో తమ వంతు సాయం చేశారు.
అయితే పాట్నా చివరివరకు పోరాడి ఓటమిపాలయ్యింది. రైడింగ్ లో 17 పాయింట్లతో కాస్త వెనకబడ్డా ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 3 ఇలా అన్నిట్లోనూ ముంబై కంటే ఎక్కువ పాయింట్లను సాధించింది. అయినప్పటికి విజయాన్ని సాధించలేకపోయింది.
పాట్నా ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల్ 6, ఇస్మాయిల్ 6, లీ జంగ్ 3, హదీ 3, రవిందర్ 3, జయదీప్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. మిగతావారు పాయింట్లు సాధించడంలోనూ, ముంబైని పాయింట్లు సాధించకుండా అడ్డుకోవడంలోనూ విఫలమయ్యారు.. దీంతో 34-30 పాయింట్ల తేడాతో ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.