సారాంశం

చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొడుతున్నారు. దీంతో తొలి రోజే భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. 

చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొడుతున్నారు. దీంతో తొలి రోజే భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల హైజంప్-టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ స్వర్ణం సొంతం చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్.. 2.02 మీటర్ల బెస్ట్ జంప్‌తో స్వర్ణం సొంతం చేసుకోవడమే కాకుండా.. సరికొత్త రికార్డును కూడా నెలకొల్పారు. ఇదే విభాగంలో ఉన్ని రేణు 1.95 మీటర్ల బెస్ట్ జంప్‌తో కాంస్యం సొంతం చేసుకున్నారు. 

దీంతో భారత్‌ ఖాతాలో  ఇప్పటివరకు 6 స్వర్ణాలు చేరినట్టుగా అయింది. పురుషుల హైజంప్ టీ47 ఫైనల్‌లో నిషాద్ కుమార్, పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1లో  అవని లేఖరా, పురుషుల 5000 మీటర్ల టీ 11లో అంకుర్ ధామా స్వర్ణాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

పారా ఆసియా గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ సొంతం చేసుకున్న మొత్తం పతకాల సంఖ్య..  17కు చేరింది. అందులో స్వర్ణం 6, రజతం 6, కాంస్యం 5 ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 

ఇక, 2018 ఇండోనేషియాలో జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలతో సహా 72 పతకాల రికార్డును.. ఈ సారి అధిగమించాలని భారతదేశం భావిస్తోంది.