Asianet News TeluguAsianet News Telugu

బుద్ద జయంతి

వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఆనేక సంవత్సరాల పాటు తపస్సుచేసి చివరకు రావి చెట్టు క్రింద కూచుని జ్ఞానాన్ని సంపాదించాడు. 

When is Buddha Jayanthi 2020? Know everything about Gautama Buddha's birth celebrations
Author
Hyderabad, First Published May 24, 2020, 7:21 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

When is Buddha Jayanthi 2020? Know everything about Gautama Buddha's birth celebrations

బౌద్ద ప్రవక్త గౌతమ బుద్దుడు. గౌతముడు క్రీస్తు పూర్వం 563 జన్మించి 483 లో మరణించాడు. అంటే బుద్దుడు మొత్తం 80 ఏళ్ళు జీవించాడు. ఈయన క్షత్రియ వంశంలో జన్మించాడు. 'సిద్ధార్థుడే' గౌతమ బుద్ధుడు. వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పరిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఆనేక సంవత్సరాల పాటు తపస్సుచేసి చివరకు రావి చెట్టు క్రింద కూచుని జ్ఞానాన్ని సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా రూపొందినది.  

బుద్ధుని జీవితం
బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ క్లుప్తంగా క్రింద వివరించబడినవి. అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. 

ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంథస్థం చెయబడలేదు.

ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ నాగరికత, జీవన విధానం వివరించబడింది.

బుద్ధుని జననం ;-
సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్ధుని ఇంటి పేరు కాదు సిద్ధార్ధుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోధనుడు, తల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి). సిద్దార్డుడు గర్భమందున్నప్పుడు మాయాదేవి ఒక ఆరు దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక రోజు కలగంటుంది. అది జరిగిన పది చంద్ర మాసముల తర్వాత సిద్ధార్డుడు జన్మింస్తాడు.

శాక్య వంశాచారము ప్రకారం గర్భావతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. ప్రయాణ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ రోజు నాడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తుని చెప్పమని ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానింస్తాడు. 

జ్యోతిష పండితులలో కౌండిన్యుడనే పండితుడు సిద్దార్దుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జ్యోస్యం చెబుతాడు. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే శుద్ధోధనుడు సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.

బాల్య జీవితం, వివాహం :- సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాస వంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని సామాన్య ప్రజల కష్ట సుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరుగుతాడు.

సిద్దార్డునకు 16 ఏండ్ల ప్రాయము వచ్చే సరికి యశోధరతో వివాహం జరిపిస్తారు. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు 29 ఏళ్ల వరకు రాజ భోగాలను అనుభవించాడు. మహారాజు శుద్ధోధనుడు, తన కుమారునకు కావలసిన రాజ భోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు.

బుద్దుని ఇతర పేర్లు :- ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, శౌద్ధోదని, సర్వార్థసిద్ధుడు, సిద్ధార్థుడు. అను పలు పేర్లతో పిలవబడేవాడు.

రాజ భోగాలనుంచి నిష్క్రమణ, సన్యాసి జీవితం :-  సిద్ధార్దుడు తన అంతఃపురాన్ని, రాజ భోగాలను వద్దలి పరివ్రాజక జీవితం గడపడానికి బయలుదేరాడు. అతనితో పాటు రాజ భటులు, ప్రేమజంటలు, దేవతలు కూడా కనబడతారు. సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట సుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా తన 29వ ఏట ఒక రోజు సిద్ధర్డుడు ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూస్తాడు. అప్పుడు తన రథసారథి చెన్నుడు ద్వారా ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించుకుంటాడు.

అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి తన రథసారథి ఛన్న సహాయంతో ఒకనాడు రాజ భవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకుంటాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ (మహాభినిష్క్రమణ) అంటారు.

సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్దార్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సమూపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాట ఇస్తాడు.

తర్వాత సిద్ధార్దుడు రాజ గృహన్ని విడిచిపెట్టి ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేస్తాడు. అలరకలమ అనే సన్యాసి తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని ఆ బోధనల వల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.

తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేస్తాడు. ఆ శిష్యబృందమంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు సిద్ధార్దుడు నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.

జ్ఞానోదయం :- తర్వాత సిద్ధార్దుడు ధ్యానం (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా క్రమశిక్షణారహితుడుగా భావించారు. చివరకు తన 35వ ఏట 49 రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. 

కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్దుడు గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు.

జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.

ఆయాచన సూక్తిలో ఉన్నా కొన్ని గాథల ప్రకారం జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. 

బుధ్ధుని బోధనలను వినుచున్న శిష్యులు జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ, ఉద్దకరామపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు, కాని వారు అప్పటికే మరణించారు.

బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో కౌండిన్యిని దగ్గర తనతో పాటూ శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు, అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60 ని దాటింది. తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం 1000 ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు.

దేశ పర్యటన , బౌద్ధ మత ప్రచారం :- మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరీవాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్, దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్ప తత్వవేత్తలను మొదలుకొని వీధులను శుభ్రం చేసే అంటరానివారు అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంస భక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం కుల, వర్గ విభజన లేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. 

దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు. బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ సన్యాసులతోనూ భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ ఒక్క వర్షాకాలం తప్ప మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్ష కాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందిన సన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే 'వస్సాన' అని అంటారు.

మొదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలో బింబిసారునికిచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగృహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడు రాజగృహ సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధ మత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు తనశిష్యులతో కలిసి ఇక్కడ కొంత కాలం బస చేశాడు.

బుద్ధునికి జ్ఞానోదయమయిన విషయం తెలుసుకుని శుద్ధోధనుడు, బుద్ధుని కపిలవస్తు రమ్మని రాజ దూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి, జ్ఞానోదయమయిన 2 సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకన ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. 

బుద్ధుడు కపిలవస్తుకు చేరుకున్నాక రాజ భవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్ధోధనుడు బుద్ధునితో "మనది మహామస్సాట రాజవంశము. మన వంశంలో ఏ ఒక్క వీరుడు కుడా భిక్షాటన చెయలేదు" అని అన్నాడు. దానికి బుద్ధుడు "భిక్షాటన రాజ వంశాచారము కాదు. అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు వేల కొద్దీ బుద్దులు భిక్షాటన చేశేవారు" అని చెప్పాడు.

తర్వాత శుద్ధోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజ భవనానికి భోజనం కొరకు ఆహ్వానించాడు. భోజనం తర్వాత ధర్మముపై జరిగిన చర్చలో శుద్ధ్దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శొతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజ కుటుంబీకులు బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరి సన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు 7 సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి (వరుసకు బుద్ధుని సోదరుడు) మొదట బౌద్ధ భిక్షువుగా మారిన తర్వాత బుద్ధుని శత్రువుగా మారి బుద్ధుని చంపాలని చాలా సార్లు ప్రయత్నించాడు.

బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ద మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూ ఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన, పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు. బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపై ఉండడంతో బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్ధోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. 

బుద్ధుని పిన తల్లి అయిన మహా ప్రజాపతి బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి కపిలవస్తుని విడిచి పెట్టి రాజగృహకు ప్రయాణమయ్యాడు. కాని మహా ప్రజాపతి నిరాశ చెందక కొందరు శాక్య, కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగృహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాత ఆనందుని మధ్యవర్తిత్వంతో స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.

తర్వాత కొంతకాలానికి దేవదత్తుడు బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో దేవదత్తుడు తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు బింబిసారుని కుమారుడైన అజాతశత్రు కలసి బుద్ధుని, బింబిసారుని హత్య చేసి తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. దేవదత్తుడు మూడు సార్లు బుద్ధుడిని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపై నుండి ఒకపెద్ద బండ రాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలను మాత్రం తాకింది. మూడవ సారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యింది.

ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో దేవదత్తుడు బౌద్ధ సంఘంలో స్త్రీలకు మాత్రమే కేటాయించిన వినయమనే నియమంపై కొత్తగా ఆంక్షలను విధించి బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూసాడు. కాని బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలు పెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసినా సారిపుత్త, మహా మొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించిచెప్పి తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగాచేశాడు.

బుద్ధుని నిర్యాణం :- మహా పరనిభాన సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని ( ఒక విషపు పుట్ట గొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు ) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి తన అస్వస్థతకు కారణం కుంద ఇచ్చిన ఆహారం కాదని తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి కుందని ఒప్పించమని పంపాడు.

కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియజేయడానికి కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది. తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీ ఎవ్వరు ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు.

వీటిలో కొన్ని ఇప్పటికి భద్రంగా ఉన్నాయంటారు ( శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపు నుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినే టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు) , బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాలలో బంగారు డిబ్బీలో భద్రపరచబడి వున్నాయి. శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ , మహావంశ శాసనాలను బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి బుద్ధుడు క్రీ.పూ. 486లో ( ధేరవాద శాసనం ) గానీ లేదా క్రీ.పూ. 383లో ( మహాయాన శాసనం ) నిర్యాణమొందాడు. 

కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543 లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరు భావించడమే. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios