Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

మరో నలుగురి పరిస్థితి విషమం

4 Killed In Road Accident In Chittoor

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీలేరు మండలంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరలో డప్పు వాయించడానికి వచ్చిన వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. సిమెంట్ లోడ్ లతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లి గ్రామంలో నల్లగంగమ్మ జాతర జరుగుతోంది. ఈ జాతరలో డప్పు వాయించడానికి  నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన కొందరు కళాకారులు వడ్డిపల్లికి వచ్చారు. జాతర ముగియడడంతో తిరిగివెళ్తున్న క్రమంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా మితిమీరిన వేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి వీరిపైకి దూసుకువచ్చింది. దీంతో నారాయణ, జయరాం, గుర్రప్ప, వెంకటరమణ అనే కళాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవగా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రేక్ ఫెయిల్ కావడమో లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


   

Follow Us:
Download App:
  • android
  • ios