బూస్టర్ డోసు అవసరమా?.. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం.. హైకోర్టులో కేంద్రం సమాధానం
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బూస్టర్ డోసు చర్చ పెరుగుతున్నది. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసు వేయాలని యోచిస్తున్నదా? లేదా? ఒక వేళ వేయాలని భావిస్తే దాని టైమ్ లైన్ ఏమిటీ? అని ఓ ఫిర్యాదు ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది. దీనిపై స్పందించాల్సిందిగా కోర్టు కేంద్రప్రభుత్వాన్ని అడిగింది. బూస్టర్ డోసు అంశం పరిశీలనలో ఉన్నదని వివరించింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) వేగంగా ప్రపంచ దేశాలన్నింటికీ పాకుతుండటంతో బూస్టర్ డోస్(Booster Dose) ఆవశ్యకతపై చర్చ పెరిగింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బూస్టర్ డోసు కచ్చితంగా వేయాల్సిందేనని బలమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అదనపు డోసు, పిల్లలకు టీకా అంశాలూ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ బూస్టర్ డోసు అందించే అవకాశాలపై చర్చ జరుగుతున్నది. మన దేశంలో బూస్టర్ డోసు అందించడం తప్పనిసరా? కాదా? ఒక వేళ ఈ బూస్టర్ డోసు వేయడం తప్పనిసరి అయితే, దానికి పట్టే సమయం గురించిన వివరాలు అందించాలని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది.
బూస్టర్ డోసు వేయాల్సిన అవసరం ఉన్నదా? ఉంటే దాని టైమ్ లైన్ గురించి వివరించాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారిస్తున్నది. ఈ విచారణలో భాగంగానే వీటికి సమాధానం చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన సమాధానం తెలిపింది. మన దేశంలో కరోనా టీకా పంపిణీ కోసం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ), నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్-19(ఎన్ఈజీవీఏసీ)లు కీలకమైన కమిటీలు అని కేంద్రం వివరించింది. ఎన్టీఏజీఐ.. ఎన్ఈజీవీఏసీకి సూచనలు చెబితే.. కేంద్ర ఆరోగ్య శాఖకు వ్యాక్సినేషన్పై ఎన్ఈజీవీసీఏ మార్గదర్శకాలు అందిస్తుందని తెలిపింది. అంతటి ముఖ్యమైన ఈ కమిటీల నుంచి తమకు ఇప్పటి వరకు బూస్టర్ డోసు వేయాలనే ప్రతిపాదన రాలేదని పేర్కొంది. ఈ రెండు కమిటీలు టీకా షెడ్యూల్కు సంబంధించి శాస్త్రీయతపై చర్చలు, అధ్యయనం చేపడుతున్నదని వివరించింది. బూస్టర్ డోసు అవసరంపై, దాని ఆవశ్యకతపైనా అధ్యయనం జరుపుతున్నదని తెలిపింది.
Also Read: బూస్టర్ డోసు అత్యవసరమేమీ కాదు - ఐసీఎంఆర్
ఎన్టీఏజీఐ టీకా టెక్నికల్ అంశాలపై అంటే.. డోసుల మధ్య కాల పరిమితి, సైడ్ ఎఫెక్ట్స్ ఇతరత్రాలపై పరిశోధనలు జరుపుతుందని, ఈ అధ్యయనాలకు అనుగుణంగా ఎన్ఈజీవీఏసీ వీటిపై కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు చెబుతుందని తెలిపింది. ఇప్పుడు మన దేశంలో టీకా వేసిన తర్వాత అది ఎంత కాలం పని చేస్తుందో చెప్పే సమాచారం ఇప్పుడు లేదని వివరించింది. మరికొంత కాలం తర్వాతే దానిపై ఓ స్పష్టత వస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ 2020 నుంచి మన దేశంలో కలకలం రేపుతున్నదని, కానీ, దాని సంక్రమణ సామర్థ్యం, సమగ్రమైన బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పటికీ తెలియదని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బూస్టర్ డోసు ఆవశ్యకతపై నిర్ధారణకు రాలేమని, దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రావల్సి ఉన్నదని తెలిపింది.
Also Read: Omicron : కోవిషీల్డ్ సెకండ్ డోస్ వ్యవధి తగ్గించండి ... కేంద్ర మంత్రి మాండవీయకు హారీశ్ రావు లేఖ
ప్రస్తుతానికైతే దేశంలోని అర్హులందరికీ రెండు డోసుల టీకా అందజేయడమే లక్ష్యంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ రెండు కమిటీల నుంచి ఇప్పటి వరకు బూస్టర్ డోసుకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలు రాలేవని తెలిపింది.
బూస్టర్ డోసు వేసుకోవాల్సినంత అత్యవసర పరిస్థితులు ఇప్పుడు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. రెండు డోసులు తీసుకున్న వారిలో కరోనా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ మేరకు ఐసీఎంఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డాక్టర్ సమీరన్ పాండా ఓ మీడియా సంస్థతో ఆదివారం మాట్లాడారు. బూస్టర్ డోసు ఎంత వరకు ఉపయోగం ఉంటుంది ? అది ఎవరికి ఇవ్వాలి ? ఎమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అనే విషయాలపై ఎం టగీ పరిశోధనలు చేస్తుందని చెప్పారు. దాని ఫలితాలు వచ్చాక బూస్టర్ డోసుపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఒక వేళ బూస్టర్ డోసు ఇవ్వాల్సి వస్తే రోగ నిరోదక శక్తి తక్కవగా ఉన్న వారికి, అలాగే వృద్దులకు ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చల తరువాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు.