Asianet News TeluguAsianet News Telugu

తిత్లీ తుఫాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే....

ఉత్తరాంధ్రను గజగజ వణికించిన తుఫాన్ తిత్లీ. ఈ తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అల్లకల్లోలంగా మారింది. అయితే ఈ తుఫాన్ కు తిత్లీ అని పేరుపెట్టింది పాకిస్థాన్ దేశం అని తెలుస్తోంది. తిత్లీ అంటే సీతాకోక చిలుక అని అర్థం. 

Titli was named by Pakistan
Author
Delhi, First Published Oct 12, 2018, 5:51 PM IST

హైదరాబాద్: ఉత్తరాంధ్రను గజగజ వణికించిన తుఫాన్ తిత్లీ. ఈ తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా అల్లకల్లోలంగా మారింది. అయితే ఈ తుఫాన్ కు తిత్లీ అని పేరుపెట్టింది పాకిస్థాన్ దేశం అని తెలుస్తోంది. తిత్లీ అంటే సీతాకోక చిలుక అని అర్థం. 

ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం 2004 నుంచి సంప్రదాయంగా వస్తుంది. ఇటీవల కాలంలో భారత్ మరియు పాకిస్థాన్ తోపాటు మరో ఆరు దేశాలు తుఫాన్ లకు పేర్లు పెడుతున్నాయి. అయితే ఈ పేర్లలో అత్యధికం స్త్రీలకు సంబంధించినవే ఉండటం విశేషం. ఇటీవల సంభవించిన తుఫాన్లుకు పెట్టిన నీలోఫర్, లెహర్, లైలా పేర్లే అందుకు నిదర్శనం. 

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్‌హుద్ తుపానుకు ఓమన్ దేశం నామకరణం చేసింది. హుద్‌హుద్ అనేది ఓ పక్షి పేరు. ఫైలిన్, నిలోఫర్, లెహర్, లైలా,దాయె వంటి పేర్లు ఇటీవలి కాలంలో ఆసియాలోని వివిధ ప్రాంతాలను వణికించిన తుపాన్లు. వీటికి ఆ పేర్లను ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలు పెట్టాయి.

ఇకపోతే తిత్లీ తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్ర తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా  శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్రలో 8మందిని బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురిని, విజయనగరం జిల్లాలో ముగ్గురిని పొట్టనబెట్టుకుంది. 

తుఫాన్ శ్రీకాకుళం జిల్లా పలాస మరియు ఒడిస్సాలోని గంజా మధ్య తీరం దాటంతో తీవ్ర గాలులు వీచాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గాలుల ప్రభావానికి ఇంటిపైకప్పు లేచిపోయాయి. చెరువులకు గండ్లు పడటంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సుమారు 3వేలకు పైగా విద్యుత్ స్థంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు...ఏయే దేశాలు పెడతాయి: 

వాస్తవానికి ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 1953 నుంచే ఉంది. ఐరాసకు చెందిన వరల్డ్ మెట్రొలాజికల్ ఆర్గనైజేషన్ ఈ పని చేస్తుంది. కానీ, దక్షిణాసియాలో, మధ్య ప్రాచ్యంలో తుఫాన్లకు పేర్లు పెట్టడం ఇటీవలే మొదలైంది. గతంలో చాలా ఏళ్ల పాటు హిందూ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో తుపాన్లు ఏ పేరూ లేకుండా అనామకంగానే మిగిలిపోయాయి.

తుఫాన్లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటుందని వాతావరణ నిపుణులు భావించారు. అలాగే ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి పేర్లు పెట్టడం సమంజసమని నిర్ణయించారు. అందుకే 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ పేర్లపై సమావేశాన్ని నిర్వహించారు.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ ఎనిమిది దేశాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో అన్ని దేశాలకూ సమ ప్రాధాన్యం లభించింది. ప్రతి దేశం 8 పేర్లను కమిటీకి సమర్పించింది. అలా మొత్తంగా 64పేర్లతో ఓ జాబితా సిద్ధమైంది. ఆ పేర్లను భవిష్యత్తులో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలో రాబోయే తుఫాన్లకు పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

ఏ తుపానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలనే దానిపైన కూడా కమిటీ ఓ పద్ధతిని రూపొందించింది. దీని కోసం ఇంగ్లిష్ అక్షరక్రమం ఆధారంగా దేశాల పేర్లను ఒక క్రమంలో పొందుపరిచారు. ఇంగ్లిష్ అక్షరం బితో మొదలయ్యే బంగ్లాదేశ్‌ ఆ జాబితాలో మొదటి స్థానంలో టి అనే అక్షరంతో మొదలయ్యే థాయిలాండ్ ఆ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.

2004లో ఈ సమావేశం అనంతరం అక్టోబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుపానుకు ఒనిల్ అనే పేరును పెట్టారు. ఈ పేరును జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ సూచించింది. అదే ఏడాది నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుపానుకు అగ్ని అనే పేరు పెట్టారు. ఆ పేరును జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ సూచించింది.

అలా ఇప్పటివరకు జాబితాలో ఉన్న దేశాలు వరసగా సూచించిన పేర్లనే ఒక్కో తుపానుకు పెడుతూ వచ్చారు. గతంలో భారత్‌ను వణికించిన హుద్‌హుద్ తుఫాను పేరును ఒమన్,  ఫైలిన్ తుఫాన్ పేరును థాయిలాండ్, వర్ధ నర్గిస్ పేర్లను పాకిస్తాన్ సూచించాయి.

ఎనిమిది దేశాలూ సూచించిన 64పేర్లలో ఇప్పటిదాకా 54 పేర్లను వాడేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చెలరేగిన తుపానుకు పెట్టిన ‘తిత్లీ’ పేరు జాబితాలో 54వ స్థానంలో ఉంది. తిత్లీ  తరువాత ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుపానుకు గజా అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును శ్రీలంక సూచించింది.

2004లో జరిగిన సమావేశంలో భారత్ తన వంతుగా 8 పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థకు సూచించింది. అవి అగ్ని, ఆకాశ్,బిజ్లి, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు. ఈ ఎనిమిది పేర్లలో ఇప్పటి వరకు ఏడు పేర్లను ఉపయోగించగా వాయు పేరును మాత్రమే వాడాల్సి ఉంది. తుఫాన్లు సంభవించినప్పుడు ఢిల్లీలోని వాతావరణ విభాగం అధికారికంగా ఈ పేర్లను ప్రకటిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios