‘ఢిల్లీలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలకూ రక్షణ లేదు’.. 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్
ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ రక్షణ లేదని ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనను ఆమె రిపోర్ట్ చేశారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ రక్షణ లేకుండా పోయింది. ఢిల్లీలో 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్ జరిగింది. నలుగురు దుండగులు ఆ బాలుడిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితుడిపై కర్రలతో దాడి చేసినట్టు తెలిసింది. మృత్యు అంచుల్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మాలివాల్ రియాక్ట్ అయ్యారు.
ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనను రిపోర్ట్ చేయడంతోపాటు ‘ఢిల్లీ.. అబ్బాయిలకు కూడా సేఫ్ కాదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనను తాము టేకప్ చేసినట్టు స్వాతి మాలివాల్ వివరించారు. ఢిల్లీ పోలీసులతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు.
‘ఢిల్లీలో అమ్మాయిలను వదిలిపెట్టండి.. అబ్బాయిలు కూడా సురక్షితంగా లేరు. ఓ 12 ఏళ్ల బాలుడిపై దారుణంగా అత్యాచారం చేశారు. నలుగురు దుండగులు రేప్ చేశారు. ఆ తర్వాత కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తున్నది. దాదాపు చనిపోయే స్థితిలో బాధితుడిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తమ టీమ్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు’ అని ట్వీట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కాగా, మిగిలిన ముగ్గురు పరారీలోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపారు.