సారాంశం

ఓ వైపు అమెరికా ప్రపంచ దేశాలపై టారిఫ్ ల దాడి చేస్తున్న తరుణంలో ప్రపంచ కుబేరుడు, అమెరికా ప్రభుత్వ డోజ్ విభాగం అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ అందరినీ  ఆకర్షించింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఏం మాట్లాడారు.? ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టెస్లా, స్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలలో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా ధృవీకరించారు. 

ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను మళ్ళీ పరిశీలించామని ప్రధాని మోడీ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో భారత-అమెరికా భాగస్వామ్యాలకు అపారమైన అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఇన్నోవేషన్ కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే భారతదేశంలో టెస్లాను విస్తరించడంలో మస్క్ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఫిబ్రవరిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్‌తో వాషింగ్టన్‌లో అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, శక్తి రంగాలలో అవకాశాలను చర్చించిన విషయం తెలిసిందే. అలాగే భారతదేశం, అమెరికాలో మంచి పాలన కోసం చేసిన ప్రయత్నాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం ప్రధాని మోడీ అమెరికా పర్యటన వెళ్లిన సమయంలో ట్రంప్‌తో జరిగిన సమావేశం సందర్భంగా, ప్రధాని మోడీ ఎలాన్ మస్క్‌ను కలిశారు. “వాషింగ్టన్ డీసీలో మస్క్ తో చాలా మంచి సమావేశం జరిగింది. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అనేక అంశాలపై చర్చించాము” అని ప్రధాని  ఆ సమయంలో ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

“ఇన్నోవేషన్, అంతరిక్ష పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుస్థిర అభివృద్ధిలో భారత, అమెరికాల  మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రధానమంత్రి మోడీ, మస్క్ చర్చించారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, వ్యవస్థాపకత, మంచి పాలనలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగింది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోడీని కలవడానికి ఆ సమయంలో ఎలాన్ మస్క్ తన ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంతో కలిసి బ్లెయిర్ హౌస్‌కు వచ్చారు. మస్క్ కుటుంబంతో తన సంభాషణ గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ X వేదికగా.. ‘మస్క్ కుటుంబాన్ని కలవడం, అనేక రకాల అంశాల గురించి మాట్లాడటం ఆనందంగా ఉంది‘ అని పోస్ట్ చేశారు.