ఈ దేశంలోనే ఉంటూ పాకిస్థాన్ కోసం పనిచేస్తూ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నవారికి భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసారు. వారి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ గూఢచర్యం చేస్తున్నవారిని భద్రతా దళాలు పట్టుకుంటున్నాయి. గత రెండు వారాల్లో ఇద్దరు మహిళలు, సహా 12 మందిని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో అరెస్ట్ చేసారు. భారతదేశ సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచర్య అధికారులకు లీక్ చేసినట్లు గుర్తించి వీరిని అరెస్ట్ చేశారు. వీరికి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలున్నాయని, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న సిబ్బందితో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది.
ఆరుగురు నిందితులను పంజాబ్లో, ఐదుగురిని హర్యానాలో, ఒకరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో అరెస్టులు జరిగాయి. సైనిక కదలికలు, కంటోన్మెంట్ ప్రాంతాలు, కీలక స్థాపనలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాక్ కు పంపినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.
అరెస్టయిన వారి జాబితా :
1. జ్యోతి మల్హోత్రా (హర్యానా):
- 3.77 లక్షల YouTube సబ్స్క్రైబర్లు, 1.33 లక్షల Instagram ఫాలోవర్లు ఉన్న హిస్సార్కు చెందిన యూట్యూబర్.
- పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్తో సంబంధాలున్నట్లు, పాకిస్తాన్ గూఢచర్య అధికారులకు (PIOు) సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు.
- 2023లో వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్లో డానిష్ను కలిశారు.
- హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మాట్లాడుతూ… జ్యోతి మల్హోత్రా పాక్ కు కీలక సమాచారం చేరవేసిందని తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఆమె డానిష్తో టచ్ లో ఉందని తెలిపారు.
2. గుజాలా (పంజాబ్):
- మలేర్కోట్లకు చెందిన 31 ఏళ్ల మహిళ.
- పాకిస్తాన్ అధికారి డానిష్తో భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకుంది.
- “ఆమె డబ్బు కోసమే ఇదంతా చేసిందని పోలీసులు తెలిపారు. ఆమెకు UPI ద్వారా రూ. 30,000 అందాయి… ఓసారి రూ. 10,000 మరియు మరోసారి రూ. 20,000 అందాయని పోలీసులు గుర్తించారు.
3. యామీన్ మొహమ్మద్ (పంజాబ్):
మలెర్కొట్లకు చెందినవాడు. గుజాలతో కలిసి డిజిటల్ మార్గాల్లో సున్నితమైన సైనిక సమాచారం పంపినట్టు ఆరోపణ. ఇందుకోసం డబ్బులు అందినట్లు సమాచారం.
4. ఫలక్షేర్ మసీహ్ (పంజాబ్)
అమృత్సర్ లోని అజ్నాలాకు చెందినవాడు. ఆర్మీ కంటోన్మెంట్లు, ఎయిర్ బేస్ల వివరాలను ISIకి పంపినట్టు పోలీసులు తెలిపారు.
5. సూరజ్ మసీహ్ (పంజాబ్)
అమృత్సర్ లోని అజ్నాలాకు చెందిన ఇతడు ఫలక్షేర్తో కలిసి నిఘా కార్యకలాపాల్లో భాగస్వామి.
6. సుఖ్ప్రీత్ సింగ్ (పంజాబ్)
మే 15న అరెస్ట్. ఆపరేషన్ సిందూర్లోని సైనిక దళాల చలనం, ప్రణాళికలను లీక్ చేసినట్టు ఆరోపణ.
7. కరణ్బీర్ సింగ్ (పంజాబ్)
సుఖ్ప్రీత్తో పాటు అరెస్ట్. సైనిక సమాచారం లీక్ చేసినట్టు ఆరోపణ.
8. నౌమాన్ ఇలాహీ (హర్యానా):
పనిపట్ పరిధిలోని కైరానాకు చెందిన 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్. ISI హ్యాండ్లర్కు సున్నితమైన సమాచారం పంపినట్టు సమాచారం.
9. దవేందర్ సింగ్ (హర్యానా ):
కైథల్ కు చెందిన పొలిటికల్ సైన్స్ విద్యార్థి. పాకిస్థాన్ యాత్రలో నిఘా నెట్వర్క్తో సంబంధాలు ఏర్పడినట్టు ఆరోపణ.
10. అర్మాన్ (హర్యానా):
నుహ్ జిల్లాలో మే 18న అరెస్ట్. వాట్సాప్, సోషల్ మీడియాలో సైనిక సమాచారం పంచుకున్నట్టు ఆరోపణ.
11. షహ్జాద్ (ఉత్తర ప్రదేశ్):
రాంపూర్ కు చెందిన నకిలీ డాక్టర్. పాకిస్థాన్తో సంబంధాలు, స్మగ్లింగ్, గూఢచర్యానికి పాల్పడ్డట్టు STF నివేదిక.
12. ఎహ్సాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ (పాకిస్థాన్ అధికారి):
న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్లో పోస్టింగ్. ప్రధాన నిఘా నిర్వాహకుడిగా గుర్తింపు. మే 13న భారత్ నుంచి బహిష్కరణ.
ఈ కేసులో గూఢచారుల స్మార్ట్ఫోన్లు, డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. డిజిటల్ లావాదేవీలలో మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశముందని పోలీసులు తెలిపారు. విద్యార్థులు, గార్డులు, యూట్యూబర్లు, సామాన్య వ్యక్తులుగా ఉండే నిందితుల నుంచి దేశ భద్రతకు విఘాతం కలిగించే స్థాయిలో సమాచారం లీక్ కావడం కలకలం రేపుతోంది. మరిన్ని అరెస్టులు జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.