ఆపరేషన్ సిందూర్ వివరాలను, పాకిస్థాన్ కుట్రలను ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంలో ఉన్న ఎంపీలు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను వివరించనున్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశం సాధించిన విజయాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు.
కేంద్రం ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందంలో హైదరాబాద్ ఎంపీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేరారు. ఇందులో భాగంగా, పాక్ ఉగ్ర కుట్రలను విదేశీ ప్రభుత్వాల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఒవైసీ తెలిపారు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి భారత్ చాలా కాలంగా బాధిత దేశంగా ఉందని అన్నారు.
భారత్పై పాక్ ఉగ్రదాడులు జియా ఉల్ హక్ హయాంలోనే మొదలయ్యాయని ఓవైసీ అన్నారు. 1999 కందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ పై దాడి, 2008 ముంబయి 26/11 ఉగ్రవాద దాడులు, ఉరీ, పఠాన్కోట్ దాడులు,
జమ్మూ కాశ్మీర్లో రీసీ ప్రాంతంలో ఏడుగురు పర్యాటకుల హత్య, పహల్గామ్లో జరిగిన సంఘటనలన్నీ మానవత్వానికి ప్రమాదం అని ఒవైసీ అన్నారు.
"పాక్ ముస్లింల దేశం అన్నది అసత్యం, భారత్లోనూ 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు పాకిస్తాన్ తమను తాము ‘ఇస్లామిక్ దేశం’గా చూపించుకుంటోందన్నది అబద్ధమని ఒవైసీ అన్నారు. "భారత్లో కూడా దాదాపు 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. ప్రపంచానికి ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది," అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను ఏ గ్రూప్లో ఉంటానో, ఎవరు చైర్మన్గా ఉంటారో తెలియదని ఒవైసీ చెప్పారు. కానీ భారత్ తరఫున నిజమైన విషయం ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యమని తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే కూడా ఈ బృందంలో చేరారు. “భారతదేశం తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. ప్రధాని మోదీ గారికి, మంత్రి కిరణ్ రిజిజు గారికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు,” అని చెప్పుకొచ్చారు.