- Home
- National
- తండ్రి సాధారణ కార్పెంటర్, 50 గజాల ఇల్లు.. పాక్ గూడఛారి జ్యోతి జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు
తండ్రి సాధారణ కార్పెంటర్, 50 గజాల ఇల్లు.. పాక్ గూడఛారి జ్యోతి జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు
ప్రస్తుతం దేశమంతా జ్యోతి మల్హోత్రా పేరు మారుగోంది. పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన ఈ జ్యోతి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి.? అసలు పాకిస్థాన్ కోసం ఏం చేసింది లాంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అందమైన రూపం వెనకాల అసలైన రూపం వేరే ఉంది.
అందమైన రూపం, ఆకట్టుకునే మాటతీరు, యూట్యూబ్లో వేలాది మంది ఫాలోవర్లు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపే అసలు రూపం దాగి ఉంది. దేశ ప్రయోజనాలను దెబ్బ తీసే కన్నింగ్ గుణం ఉంది. శత్రుదేశానికి సహకరిస్తూ.. భారత్లో అమాయకుల ప్రాణాలు తీసేందుకు సహకరించిన నేపథ్యం ఉంది.
జ్యోతి మల్హోత్రా ఎవరు?
హరియాణాకు చెందిన 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా, "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెల్ వ్లాగర్గా గుర్తింపు పొందారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు దాదాపు 1.37 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్లో తన గురించి తాను.. "నొమాడిక్ లియో గర్ల్. వాండరర్. హర్యాన్వీ+పంజాబీ మోడరన్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ అని చెప్పుకొచ్చింది. భారత్తో పాటు పాక్, ఇండోనేసియా, భూటాన్, చైనా వంటి దేశాల్లో ట్రావెల్ చేస్తూ వాటికి సంబంధించిన వివరాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటుంది.
అసలు కథ అప్పుడే మొదలైందా.?
యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అంతా బాగానే ఉన్నా... జ్యోతి అసలు రూపం మాత్రం వేరే ఉందన్న విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లో పాక్ వీసా కోసం కమిషన్ ఏజెంట్ల సహాయంతో ఆమె మొదటిసారిగా పాకిస్థాన్కి వెళ్లారు. అక్కడ పాకిస్థాన్ హైకమీషన్లో ఉద్యోగి ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ దానిష్ ను కలిశారు. అతని ద్వారానే జ్యోతికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో పరిచయం ఏర్పడిందని పోలీసుల విచారణలో తేలుతోంది.
ఆపై భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉండి, భారత సైన్యం కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆమె హర్యానా, పంజాబ్లో ఉన్న గూఢచార వ్యవస్థలో భాగమైందని అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటనల సమయంలో అలీ అహ్వాన్ అనే వ్యక్తి ఆమెకు ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం.
విలాసవంతమైన జీవితం కోసమే.?
విలాసవంతమైన జీవితం కోసమే జ్యోతి దేశ ద్రోహానికి పాల్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023లో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది. అక్కడే ఆమెకు దానిష్ అనే పాకిస్తాన్ అధికారి పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందని, అప్పుడే ఫోన్ నెంబర్లు మార్చుకున్నారని తెలుస్తోంది. దానిష్ ఆమెకు ఖరీదైన ఫోన్లు, కార్లు, లగ్జరీ లైఫ్ అందిస్తానని చెప్పడంతోనే జ్యోతి డానిష్ వలలో చిక్కుకుతందని అంటున్నారు.
పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి:
జ్యోతి హర్యానాలోని హిసార్ అనే చిన్న గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించింది. 58 గజాల సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో జీవించేది. తండ్రి ఒక సాధారణ కార్పెంటర్. 20 ఏళ్ల క్రితమే జ్యోతి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్లో రిసెప్షనిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన జ్యోతి చివరికి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. చిన్ననాటి నుంచే జ్యోతికి లగ్జరీ లైఫ్ అనుభించాలనే కోరిక ఉండేది.
డానిష్ సహకారంతో తొలిసారి పాకిస్థాన్ వెళ్లిన జ్యోతి:
2023లో దానిష్ సహకారంతో జ్యోతి పాకిస్తాన్కు 10 రోజుల వీసాతో వెళ్లింది. ఆ సమయంలో జ్యోతి పాక్ ఆర్మీ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ISI ఏజెంట్లు రాణా షహబాజ్, షాకిర్తో పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. ఈ పర్యటన తర్వాతే జ్యోతి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించింది.
2024లో జ్యోతి మరోసారి పాకిస్థాన్కు వెళ్లింది. ఈసారి ఆమె ఏకంగా నెల రోజుల పాటు అక్కడ గడిపింది. ఈ సమయంలోనే పాక్ పంజాబ్ సీఎం, నవాజ్ ఇంటర్వ్యూలు చేసింది జ్యోతి. ఇక డానిష్ భార్య కూడా జ్యోతితో మాటమంతి కలిపింది. ఇస్లాంలో నాలుగు పెళ్లులు అంగీకరిస్తాయని, తన భర్తను వివాహం చేసుకోవచ్చని డానిష్ భార్య ఆఫర్ ఇచ్చింది.
ఆ తర్వాతే జ్యోతి, డానిష్లు కలిసి ఇండోనేషియాలో బాలి టూర్కు వెళ్లారు. అక్కడే జ్యోతి ISI ట్రైనింగ్ పొందిన ఏజెంట్గా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టూర్ తర్వాత భారత్కు వచ్చిన జ్యోతికి పాకిస్థాన్కు భారత్కు సంబంధించిన సమాచారాన్ని పంపించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే భారత సైన్యానికి సంబంధించి కీలక సమాచారం ISIకి పంపిందని ఆరోపణలు ఉన్నాయి.
జ్యోతిపై అనుమానం ఎలా మొదలైంది.?
2024 ఏప్రిల్లో 12 రోజుల పాటు పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి, అక్కడి టూరిజం చూపించాలనే ఉద్దేశంతో వెళ్లినట్టు చెప్పింది. కానీ కొన్ని వారాల తరువాత చైనా వెళ్లిన జ్యోతి అక్కడ లగ్జరీ షాపింగ్, ఖరీదైన కార్లలో తిరిగిన వీడియోలు ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ అనూహ్యమైన మార్పును గమనించిన అధికారులు ఆమెపై నిఘా పెట్టారు.
ఎలా అరెస్ట్ చేశారు.?
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత నిఘా వర్గాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగానే జ్యోతితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో నుహ్కు చెందిన అర్మాన్, పంజాబ్ మలేర్కోట్లాకు చెందిన గజాలా, కైతల్కి చెందిన యమిన్ మోహమ్మద్, దేవీందర్ సింగ్ ధిల్లన్ ఉన్నారు. అయితే జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది.
ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు.?
జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయ సన్హిత (BNS) సెక్షన్ 152, ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, 1923 - సెక్షన్లు 3, 4, 5 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు దేశ రహస్యాలను లీక్ చేయడం, విదేశీ ఏజెంట్లతో సంబంధాలు, స్పైయింగ్ వంటి కేసులపై వర్తిస్తాయి. శిక్షగా 3 సంవత్సరాల జైలు నుంచి జీవిత ఖైదు వరకూ ఉంటుంది. జ్యోతిని 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆమె ఫోన్, ల్యాప్టాప్ తదితర పరికరాలను సీజ్ చేసి డేటాను విశ్లేషిస్తున్నారు.
పహల్గామ్ దాడులతో లింక్ ఉందా.?
పహల్గామ్ ఉగ్రదాడులతో జ్యోతికి సంబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణం 2024 మార్చిలో పాకిస్తాన్ వెళ్లే ముందు జ్యోతి డిసెంబర్-జనవరిలో పహల్గామ్కు వెళ్లడమే. ఇందుకు సంబంధించి ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. పహల్గామ్కు సంబంధించిన వివరాలను పాకిస్థాన్తో పంచుకుందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.