ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మాస్ట‌ర్‌మైండ్‌గా చెబుతోన్న షేక్ సజ్జాద్ గుల్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండీలో లష్కరే తోయిబా (LeT) రక్షణలో దాకి ఉన్నాడు. అతను పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI)కు కీలక వ్యక్తిగా పనిచేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

గుల్ విద్యాభ్యాసం భారతదేశంలోనే జరిగింది. అతను శ్రీనగర్‌లో స్కూలింగ్ పూర్తి చేసిన తరువాత, బెంగళూరులో ఎంబీఏ చదివాడు. అనంతరం కేరళలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. తిరిగి కశ్మీర్‌కి వచ్చి ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. అదే ల్యాబ్ ద్వారా ఉగ్రవాద సంస్థలకు లాజిస్టిక్ సపోర్ట్ అందించేవాడు.

2002లో ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వద్ద 5 కిలోల ఆర్డీఏక్స్‌తో డిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అతడిని అరెస్ట్ చేసింది. 2003లో అతనికి 10 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. 2017లో విడుదలైన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లి, 2019లో TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రసంస్థకు నాయకత్వం వహించాడు.

TRFను LeT ఆధ్వర్యంలో కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాద సంస్థగా చూపించాలన్న ఉద్దేశంతో ISI ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది పుల్వామా దాడి అనంతరం ప్రపంచ విమర్శల తాలూకు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ చేపట్టిన వ్యూహం. ప‌హ‌ల్గామా దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఉగ్రవాదులు ముందుగా వారి మతాన్ని అడిగి, తరువాత అతి సమీపం నుంచి కాల్చినట్టు అధికారులు తెలిపారు.

వీరిలో ఒక స్థానిక గైడ్, పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో మృతి చెందాడు. దాడి బాధ్యతను TRF స్వీకరించింది. దానికి గుల్‌ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని విచారణలో తేలింది. 2020 నుంచి 2024 వరకు కశ్మీర్‌లోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ప‌లు దాడులు జ‌రిగాయి. 

2023లో గ్రెనేడ్ దాడులు, బీజ్బెహరా, గగంగీర్, జడ్-మోర్ టన్నెల్ వద్ద పోలీసులపై దాడులు చేయడంలో కూడా గుల్ పాత్ర ఉందని గుర్తించారు. గుల్‌పై రూ. 10 లక్షల బహుమతి ప్ర‌క‌టించారు. TRFకి నాయకత్వం వహిస్తూ, ISI ప్రోత్సాహంతో ఉగ్రదాడులకు ఆదేశాలు ఇస్తున్నాడు. అతని బంధువులు కూడా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నవారే. అతని సోదరుడు ఒకప్పుడు శ్రీనగర్‌లో డాక్టర్‌గా పని చేశాడు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉండే పరారీలతో కలిసి ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నాడు.