Operation Sindoor: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు

Synopsis
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అధికారులు, పోలీపులు అలర్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
Telangana on high alert after Operation Sindoor CM Revanth reviews
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’పై దుష్ప్రచారం చేయవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఈ ఆపరేషన్పై ఫేక్ న్యూస్ లేదా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు పంచడం, అపోహలు కలిగించే పోస్టులు పెడితే కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రజలు సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడంలో జాగ్రత్త వహించాలని, తప్పుడు సమాచారం పంచడం నేరమని తెలిపింది. ఎవరైనా అనుమానాస్పద సందేశాలు లేదా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వాటి స్క్రీన్షాట్లు లేదా వివరాలను 8712672222 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలని కోరింది.
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: తెలంగాణ పోలీసులు అలర్ట్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం తెలంగాణ రాష్ట్రం పోలీసులు అలర్ట్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అత్యవసర సేవల శాఖలన్నిటి ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ తక్షణ సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను గుర్తించండి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బాంగ్లాదేశ్ దేశాలకు చెందిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసు శాఖకు సీఎం రేవంల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలను పెంచాలని, అత్యవసర ఔషధాల సరఫరా నిరంతరంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఆసుపత్రులలో ఖాళీ పడకల సమాచారాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేయాలని చెప్పారు. "భారత సైన్యానికి ఏకగ్రీవ మద్దతు చాటేలా రాష్ట్రం స్పందించాలి" అని సీఎంను ఉద్ఘాటిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి
సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తప్పుడు సమాచారం వ్యాపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీనికోసం ఒక ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
గ్రీటర్ హైదరాబాద్లోని మూడింటి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. విదేశీ దౌత్య కార్యాలయాలు, ఐటీ కంపెనీల భద్రతను పెంచాలని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను బలోపేతం చేయాలని సూచించారు.
భారత సైన్యానికి మద్దతుగా మే 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు.
అత్యవసర వస్తువుల సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, రెడ్ క్రాస్ వంటి సంస్థలతో సమన్వయం పెంచాలని సీఎం సూచించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర ఇంటెలిజెన్స్తో సమన్వయం కలిగి ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేయనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఆపరేషన్ సిందూర్ అనంతర పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.