ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన సభలో ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే.
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోదీ, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. భారత్ ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత పటిష్ఠంగా కొనసాగించనుందన్నారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కాన్పూర్ యువకుడు శుభం ద్వివేది కుటుంబాన్ని ప్రస్తావిస్తూ, ఆయన కుమార్తె ఐష్ణయ బాధను దేశం మొత్తం పంచుకుంటోందని మోదీ తెలిపారు. దేశం అంతటా ఆపరేషన్ సింధూర్ రూపంలో భారత మహిళల ధైర్యాన్ని ప్రపంచం చూసిందన్నారు.
భారత సైన్యం ముందు పాక్ తలవంచింది
భారత భద్రతా దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాల్లోకి ప్రవేశించి, ఆయా స్థావరాలను నాశనం చేశాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత సైన్యం ప్రదర్శించిన సాహసం ముందు పాకిస్తాన్ తలవంచిందని, యుద్ధం ఆపమని వేడుకోవాల్సి వచ్చిందని తెలిపారు. శత్రువులు ఏ భ్రమలోనూ ఉండకూడదని మరోసారి హెచ్చరించారు.
భారతదేశం ఉగ్రవాదానికి మూడు ముఖ్యమైన విధానాలను తీసుకుందని ప్రధాని వెల్లడించారు. దాడి ఎప్పుడు, ఎలా జరగాలో నిర్ణయించే హక్కు త్రివిధ దళాలదే. భారత్ ఇకపై అణు బాంబుల పేచీకి భయపడదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో ఎలాంటి తేడా లేకుండా వ్యవహరిస్తామని మోదీ స్పష్టం చేశారు.
స్వదేశీ ఆయుధాల సత్తా
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తయారుచేసిన ఆయుధాలు, ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణులు, శత్రు ప్రాంతాల్లో లక్ష్యాలను ధ్వంసం చేశాయని ప్రధాని తెలిపారు. లక్ష్యం నిర్దేశించిన ప్రదేశాల్లోనే పేలుళ్లు జరిగాయని చెప్పారు. ఈ విజయాల వెనుక స్వావలంబన భారత సంకల్పం ఉంది అన్నారు.
కాన్పూర్పై వరాల జల్లు
కాన్పూర్పై ప్రధానమంత్రి వరాల జల్లు కురిపించారు. మొత్తం రూ. 47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో కాన్పూర్ మెట్రోలో చున్నిగంజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ వరకు 5 కొత్త భూగర్భ మెట్రో స్టేషన్లు, ఘటంపూర్లో 660 మెగావాట్ల విద్యుత్ యూనిట్, పాంకిలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.