కేవలం అన్న కేటీఆర్ తోనే కాదు తండ్రి కేసీఆర్ తోనూ కవిత సంబంధాలు దెబ్బతిన్నాయా? అంటే ఆమె మాటలను బట్టిచూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సేమ్ టు సేమ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డల మాదిరిగానే మాజీ సీఎం కేసీఆర్ బిడ్డల వ్యవహారం తయారయ్యింది. వైఎస్సార్ చనిపోయాక వైఎస్ జగన్, షర్మిల మధ్య విబేధాలు మొదలయ్యాయి కానీ కేసీఆర్ బ్రతికుండగానే కేటీఆర్, కవిత మధ్య విబేధాలు బైటపడుతున్నాయి. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబంలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ అలజడి రేపుతున్నాయి. రాజకీయ ఆదిపత్యం కోసమేనా లేక వైఎస్ కుటుంబంలో మాదిరిగా ఆస్తుల గొడవలు కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నాయా? అన్నది భవిష్యత్ తేల్చనుంది.

అయితే కవిత తన అన్న కేటీఆర్ తో విబేధిస్తున్నారని ఆమె మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. బిఆర్ఎస్ కు కేసీఆర్ మాత్రమే నాయకుడు అని చెప్పడం ద్వారా ఆమె కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడంలేదని చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల తాను తండ్రికి రాసిన లేఖ బయటకురావడంతో ఇంతకాలం గుట్టుగా ఉన్న కేటీఆర్-కవిత మధ్య విబేధాలు బైటపడ్డాయి. వీరమధ్య తండ్రి వారసత్వం కోసం కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ఇద్దరు బిడ్డల మధ్య గొడవలో నలిగిపోతున్నారు.. కానీ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొడుకు కేటీఆర్ కు ఇప్పటికే అప్పగించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించబడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. 

కవిత మాటలనుబట్టి చూస్తే ఆమె లేఖ బయటకు రావడం వెనక స్వయంగా కేసీఆర్ హస్తమేమైనా ఉందా అనుమానం కలుగుతోంది. చాలాకాలంగా తండ్రికి లేఖలు రాస్తుంటానని... ఆ లేఖను చదవగానే ఆయన చించేస్తారని కవిత తెలిపింది. కానీ ఈసారి ఎందుకో అలా జరగలేదు.. లేఖ బయటకు వచ్చింది అంటూ కవిత తండ్రిపైనా అనుమానం వ్యక్తంచేసేలా మాట్లాడారు.

ఇప్పటికే తన తండ్రి దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. తన లెటర్ బయటకు రావడంవెనక కుట్ర దాగివుందున్నారు. తాజాగా మరోసారి తాను తండ్రికి రాసిన లేఖపై కవిత స్పందించారు... లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలన్నారు. అలాగే కొత్త పార్టీ పెడతారని, కాంగ్రెస్ లో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై కవిత రియాక్ట్ అయ్యారు. తనకంటూ ప్రత్యేకంగా జెండా, ఎజెండా ఏమీ లేదన్నారు... బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడమే ఏకైక ఎజెండాగా పేర్కొన్నారు.

ఇదే సమయంలో మరోసారి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని కవిత స్పష్టం చేసారు. కేసీఆర్‌ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని... బిఆర్ఎస్ పగ్గాలు ఎప్పటికీ ఆయన చేతిలోనే ఉండాలన్నారు. నాయకుడిగా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన వెంట నడుస్తాను అనేలా కవిత కామెంట్స్ ఉన్నాయి.

బిఆర్ఎస్ పార్టీ బిజెపి వైపు చూస్తోందని ఇప్పటికే ఆరోపించిన కవిత మరోసారి దీనిపై స్పందించారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని... ఈ విషయాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.ఏదేమైనా సరే... బీజేపీలో బిఆర్ఎస్ ను విలీనం చేస్తామంటే ఒప్పుకోనని కవిత హెచ్చరించారు.

తన తండ్రికి లెటర్ రాయడంలో తప్పేమీ లేదు... ఎంతో ఆవేదనతో ఆ లేఖ రాసానన్నారు. లెటర్ రాసిన తనను విమర్శించడం మానేసి ముందు కేసీఆర్ కు వ్యక్తిగతంగా రాసిన లెటర్‌ను బయటకు తెచ్చినవారిని పట్టుకోవాలన్నారు. ఇటీవల కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చింది... కానీ కలవలేకపోయానని కవిత తెలిపారు.

మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించడంపై కవిత స్పందించారు. మావోయిస్టుల ప్రాణాలు తీసేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ వెంటనే ఆపాలని ఆమె డిమాండ్ చేసారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకపోవడం దారుణం... పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని కవిత అన్నారు.